చంద్రబాబును చూడాలని ఉంది... బీఏసీలో జగన్ సెటైర్లు: 26వరకు అసెంబ్లీ
ఒక్క రోజుకే పరిమితం అనుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తవుతున్న సమయంలో ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీంతో..ప్రభుత్వం ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించాలని.. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి..కొత్త సభ్యులు వచ్చిన తరువాత పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. అయితే, ప్రతిపక్ష టీడీపీ దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.

టీడీపీ కోరింది...సీఎం ఓకే చెప్పారు
15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోతోందంటూ ఆరోపించింది. ఇక, ఈ రోజు సమావేశం ప్రారంభమైన తరువాత బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుధారాణి ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తరువాత ఇటీవల కాలంలో మరణించిన మాజీ శాసన సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. టీడీపీ ఇచ్చి పెట్రోలు..డీజిల్ ధరల పైన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. తరువాత బీఏసీ సమావేశమైంది. అందులో సీఎం జగన్ మంత్రులు అనిల్..కన్నబాబు..చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.

ఏ చర్చకైనా సిద్దం... పద్దతి ప్రకారం నిర్వహిద్దాం
టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సభలో అనేక అంశాలు ప్రస్తావించాల్సి ఉన్నందున సభను 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేసారు. దీనికి వెంటనే సీఎం జగన్ స్పందించారు. తనకు అధికారిక కార్యక్రమాలు ఉన్నా..ప్రతిపక్షం కోరుతున్న విధంగా అసెంబ్లీ నిర్వహించటానికి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. టీడీపీ సభ్యులు ఏ చర్చ లేవనెత్తినా.. ఏ ప్రశ్న అడిగినా.. సభలో పద్దతి ప్రకారం ముందుకు వస్తే తాము సమాధానం చెప్పేందుకు సిద్దమని సీఎం తేల్చి చెప్పారు.

బీసీ జన గణన పైన సభలో తీర్మానం
శుక్రవారం సభలో బీసీ కుల గణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రతిపక్ష టీడీపీ 27 అంశాల పైన చర్చకు ప్రతిపాదించింది. ప్రభుత్వం సైతం తాము చేస్తున్న పలు సంక్షేమ పధకాలు గురించి వివరించేందుకు సిదకదమైంది. తొలి రోజున మహిళా సాధికారత పైన స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ఇక, 14 ఆర్డినెన్స్ లతో పాటుగా పలు బిల్లులు సైతం ప్రవేశ పెట్టనుంది. అయితే, టీడీపీ చర్చకు ప్రతిపాదించి పారిపోకుండా ఉంటే అన్నీ చర్చిద్దామని ముఖ్యమంత్రి బీఏసీ సమావేశంలో తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో..సభ ఏడు పని దినాల వరకు జరిగే ఛాన్స్ ఉంది.

చంద్రబాబును చూడాలని ఉంది: జగన్ సెటైర్లు
బీఏపీ సమావేశంలో సీఎం జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తనకు చంద్రబాబును చూడాలని ఉందన్నారు. కుప్పం ఎన్నికల తరువాత ఆయన మోహం ఎలా ఉందో చూడాలని ఉందని సైటైర్ వేసారు. దీనికి స్పందనగా అచ్చెన్నాయుడు ఎన్నికల్లో గెలుపు ఓటముల సహజమని వ్యాఖ్యానించారు. కుప్పం గురించి చర్చించాల్సినవి చాలా ఉన్నాయని...చంద్రబాబును సభకు తీసుకురావాలని సూచించారు.
చంద్రబాబు తప్పక సభకు వస్తారని అచెన్న చెప్పారు. అదే విధంగా సభ నిర్వహణ పైన అచ్చెన్న మరిన్ని రోజులు పొడిగించాలని కోరగా..గ్రేట్ అచ్చెన్న కోరారు.. తప్పకుండా పొడిగిద్దాం..26వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించుకుందామంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications