నారావారిపల్లి ఆవు, దూడ: త్రిడీలో అమరావతి, బాబుకు కెసిఆర్ స్పెషల్ గెస్ట్
అమరావతి: అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో విశిష్టమైన గోపూజా ఉత్సవానికి పాడి ఆవును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచి తరలిస్తున్నారు. మేలైన దేశవాళి జాతి ఆవు, దూడను ప్రత్యేకంగా ఎంపిక చేశారు.
వీటికి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారావారిపల్లి నుంచి ప్రత్యేక వాహనంలో అమరావతికి తరలిస్తున్నారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచి తీసుకు వచ్చే మన మట్టిలో ఈ గోపంచకాన్ని కలిపి శంకుస్థాపనలో వినియోగిస్తారు.
3డి రూపంలో అమరావతి
అమరావతి ఎలా ఉండబోతోంది? బృహత్ ప్రణాళిక ప్రకారం ఏయే భవనాలు ఎక్కడ వస్తాయి? అభివృద్ధి చెందిన తర్వాత నదీతీరం ఎలా మారనుంది? తదితర అంశాలతో పాటు భవిష్యత్తు అమరావతి సమగ్ర స్వరూపాన్ని వివరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శంకుస్థాపన వేడుక సభా ప్రాంగణంలో ప్రదర్శించేందుకు వీలుగా దాదాపు 450 చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఆరు పలకలతో కూడిన అతి పెద్ద త్రీడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చెన్నైకు చెందిన ఐకిక్స్ త్రీడీ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని తయారు చేస్తోంది.

రాజధాని నిర్మాణానికి జై బాలయ్య ఇటుకలు
అమరావతి నిర్మాణానికి జై బాలయ్య పేరుతో ఉన్న ఇటుకలు రానున్నాయి. ఇటుకలపై తమ హీరో పేరు ఉండేటట్లుగా వాటిని తయారు చేయిస్తున్నామని బాలకృష్ణ అభిమానులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఒక లక్ష జై బాలయ్య ఇటుకలను పంపిణీ చేస్తామని అభిమాన సంఘం ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు.
బాలకృష్ణ పేరిట తయారు చేస్తున్న ఈ ఇటుకలపై ‘జై బాలయ్య' అని ముద్రించే విధంగా తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా, మై బ్రిక్ - మై అమరావతి పేరుతో ప్రారంభించిన వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే 20 లక్షలకు పైగా ఈ - ఇటుకలను విరాళంగా ఇచ్చారు.
బాబుకు కెసిఆర్ స్పెషల్ గెస్ట్!
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు. శంకుస్థాపనకు వస్తున్న అతిథులు, వారికి చేస్తున్న ఏర్పాట్లపై చంద్రబాబు అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
ఆయనను ప్రత్యేక అతిథిగా పరిగణించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఆతిథ్యంలో ఏమాత్రం లోటు రానీయవద్దని సూచించారు. అంతేకాక రోడ్డు మార్గం మీదుగా వస్తానన్న కేసీఆర్కు హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అధికారులకు రూట్ మ్యాప్ ఇవ్వాలని కూడా ఆదేశించారు.












Click it and Unblock the Notifications