నిద్రలోకి జారుకున్న బాలయ్య : మహానాడు ప్రారంభమైన కొద్దిసేపటికే..
తిరుపతి : తిరుపతి వేదికగా శుక్రవారం నాడు టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి చెందిన టీడీపీ కార్యకర్తలు, నేతలంతా మహానాడుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేసిన టీడీపీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.
అయితే పని ఒత్తిడో.. అలసటో గానీ మహానాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే పార్టీ ముఖ్య నేతలైన డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నిద్రలోకి జారుకున్నారు. మహానాడు వేదికపై ఈ నేతలంతా ముందు వరుసలో కూర్చోవడంతో మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీంతో కునుకు తీస్తున్న టీడీపీ నేతల ఫోటోలు ఇంటర్నెట్ సహా ఆయా మీడియా ఛానెళ్లలో దర్శనమిస్తున్నాయి.
మహానాడు ప్రాంగణంలో పలువురు టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ సెల్ఫీలు దిగుతూ కనిపించారు.ఇకపోతే మహానాడు ప్రాంగణమంతా పసుపుమయంతో నిండిపోయింది. ఎటు చూసినా పచ్చ జెండాల రెపరెపలు, నాయకుల కటౌట్లు కనిపిస్తున్నాయి. అలాగే సభ వెలుపల పలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి.. టీడీపీ కండువాలు, ట్యాగ్లు, సైకిల్ కీచైన్లతో పాటుగా పసుపు చొక్కాలను విక్రయిస్తున్నారు.
వాటి ధరలను పరిశీలిస్తే.. పార్టీ కండువా రూ.100, ఆర్డినరీ ట్యాగ్ రూ.20, వీఐపీ ట్యాగ్ రూ.50, కీచైన్ రూ.10లు చొప్పున విక్రయిస్తున్నారు. వీటితో తెలుగుదేశం పార్టీ ఎదుగదలకు పాటుపడిన పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన చరిత్ర పుస్తకాలను కూడా రూ.150లకు విక్రయిస్తున్నారు.
మహానాడు నిర్వహణ వ్యయానికి తమవంతు ఆర్థిక సహాయం అందించడానికి కొంతమంది స్వచ్చందంగా ముందుకు రావడం విశేషం. తిరుపతికి చెందిన ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యవిభాగం జిల్లా అధ్యక్షురాలు, సాయిసుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ సుధారాణి మహానాడు కోసం రూ. 5 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.