బాలినేని కథ సుఖాంతం: ఫలించిన చెవిరెడ్డి మంత్రం
Balineni Srinivas Reddy: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతూ వచ్చిన మాజీ మంత్రి, ఒంగోలు శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉదంతం.. సుఖాంతమైనట్టే కనిపిస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ వివాదానికి తెర దించినట్టయింది.
కొంతకాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. పార్టీ అగ్ర నాయకత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన అలకపాన్పుపై ఉంటోన్నారు. ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ భీష్మించారు.
ఆయనకు అనుకూలంగా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన గానీ, హామీ గానీ రాకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసహనంతో ఉంటూ వచ్చారు. ఒక దశలో బాలినేని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడానికీ సిద్ధపడ్డారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇటీవలే ఆయన వాటన్నింటికీ తెర దించారు.

తాను వైఎస్ఆర్సీలో కొనసాగుతున్నాననీ తేల్చి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు నేర్పిన రాజకీయాలే చేస్తానని, పార్టీలో ఉంటూ ద్రోహం చేయటం సరికాదని బాలినేని అన్నారు. తనపై అసత్యాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటాననీ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ను గెలిపిస్తానని బాలినేని భరోసా ఇచ్చారు.
దీని తరువాత మరో అడుగు ముందుకేశారు బాలినేని శ్రీనివాస రెడ్డి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులనూ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరిస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. ఆయన పెట్టిన డిమాండ్లపైనా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
దీనికి అనుగుణంగా త్వరలో విడుదల కాబోయే ఏడో జాబితాలో మార్పులు చేర్పలు ఉంటాయని అంటున్నారు. బాలినేని వెంట జగన్ను కలిసిన వారిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడు, ఒంగోలు లోక్సభ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. బాలినేనితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహించిన రాయబారం ఆశించిన ఫలితాలను ఇచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications