తెలంగాణను అప్పగించమన్న లోకేష్పై సుమన్ భగ్గు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సవాల్ విసిరిన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్కు తెరాస ధీటుగా స్పందించింది. గురివింద గింజలాగ తన తండ్రి పాలనలోని లోపాలను చూడకుండా టీఆర్ఎస్ పైన పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని లోకేష్ పైన తెరాస ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు.
టీఆర్ఎస్ పైన టీడీపీ పదేపదే విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాలనపై బహిరంగ చర్చకు తాను, తమ పార్టీ ఎంపీ బూర నర్సయ్య సిద్ధమని చెప్పారు. లోకేష్కు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కాగా, టీడీపీ యువనేత నారా లోకేష్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు పైన ట్విట్టర్లో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఆరు నెలల తెరాస పాలనలో సాధించింది శూన్యమన్నారు. ఈ ఆర్నెల్ల పాలనలో ఏం చేయలేని వారు చంద్రబాబు పైనే నెపం నెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి అభివృద్ధి చేయడం చేతకాకుంటే, రాజీనామా చేయాలని, టీడీపీ అభివృద్ధి చేస్తుందన్నారు.
బతుకు తెలంగాణ కావాలి: విమలక్క
బతుకినిచ్చే తెలంగాణ కావాలని ప్రజలు పోరాటం చేశారని, బంగారు తెలంగాణను ఎవరూ కోరడంలేదని అరుణోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక బుధవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు పాలమూరుకు వలస జిల్లాగా పేరు రావడానికి గత పాలకులే కారణమన్నారు.
విద్యావంతులు చైతన్యమై వలసల నివారణకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూములను బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. విద్యావంతులైన ప్రతి ఒక్కరూ, ఈ విధానాలను ఎండగట్టకపోతే రాష్ట్రం మళ్లీ 60 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి పోలీసులకు అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం, పేదలకు భూపంపిణీ చేయడంలో ఎందుకు వెనుకంజ వేస్తోందన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్న ప్రభుత్వం బడాబాబుల అక్రమ కట్టడాలను వదిలేసి, పేదల గుడిసెలను తొలగించడం దారుణమన్నారు.