ఏపీకి మళ్ళీ తుఫాను.. బంగాళాఖాతం తీవ్ర హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. గత 20 రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు దంచి కొట్టాయి.
షాకింగ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
భారీ వర్షాలు, కృష్ణా, గోదావరి వరదల ధాటికి ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు వరద బాధితులుగా మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు వరద ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలో మళ్లీ వాతావరణ శాఖ షాకింగ్ విషయాన్ని చెప్పింది.

మళ్ళీ అల్పపీడనం.. తుఫానుకు అవకాశం
ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈనెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాలలో భారీ వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మత్స్యకారులు సుముద్రాలలో వేటకు వెళ్లొద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని ,తీర ప్రాంతం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నచోట మత్స్యకారులు సుముద్రాలలో వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
పంట పొలాలలో పని చేసే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి మరియు కృష్ణాజిల్లాలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. త్వరలో మరో మారు తుఫాను కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం తో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications