జర బద్రం: ‘మైండ్గేమ్’ అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు, ఏ పార్టీని టార్గెట్ చేశారో?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సుమారు రెండేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు, ఈ రెండు పార్టీలతోపాటు టీడీపీ ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. మొదట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇటీవల పవన్ కళ్యాన్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రాజకీయ నేతల ప్రవర్తనపై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్
తాజాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జన సైనికులు, ఏపీ ప్రజలను ఉద్దేశించి పెట్టిన ఈ ట్వీట్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రవర్తన వచ్చిన మార్పులను నిశితంగా పరిశీలించాలని, అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని పవన్ కళ్యాణ్ పరోక్షంగా సూచించారు. అయితే, పవన్ ఈ వ్యాఖ్యలను ఏ పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారానేది చర్చనీయాంశంగా మారింది.

జరబద్రం.. మైండ్ గేమ్ అంటూ పవన్ కళ్యాణ్
'జర బద్రం.. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి' అంటూ పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించారు.

చర్చకు దారితీసిన పవన్ కళ్యాణ్ పొత్తుల వ్యాఖ్యలు
ఇటీవల పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మూడు మార్గాలున్నాయని చెప్పారు. మొదటిడి బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం.. రెండోది బీజేపీ, టీడీపీ పార్టీలతో కలిసి పోటీ చేయడం లేదంటే.. మూడోది జనసేన ఒంటరి పోరాటం చేయడం అని స్పష్టం చేశారు. అంతేగాక, తాము గత ఎన్నికల్లో తగ్గామని.. ఇప్పుడు మాత్రం తమతో పొత్తు పెట్టుకునే వారే తగ్గుతే బాగుంటుందని సూచించారు. ఈ క్రమంలో అప్పటి వరకు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నాలు జరిపినట్లు కనిపించిన టీడీపీ.. కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జనసేన నేతలు మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచినా.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎన్నికల సమయం వరకు అన్ని విషయాలు తేలుతాయని చెబుతున్నారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పొత్తుల వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఎవరినీ టార్గెట్ చేశారనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications