పవన్ కాకినాడ టు తిరుపతి: టిడిపి-బిజెపిలు రివర్స్ వెనుక.., అంతర్మథనం
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన ప్రశ్నించిన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ నేతల్లో అంతర్మథనం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పైకి విమర్శలు చేసినా, ఇంకొందరు స్వాగతించినా ఆ పార్టీలలో లోలోన పవన్ ప్రశ్నల పైన జోరుగా చర్చ సాగుతోందని అంటున్నారు.
పవన్ సూటిగా విసిరిన పలు ప్రశ్నలకు సమాధానం లేదని కొందరు టిడిపి, బిజెపిలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోను చర్చ సాగుతోందని చెబుతున్నారు.
తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఏపీకి ప్రత్యేక హోదా అంతే ముఖ్యమని ఏపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అలాంటప్పుడు తెలంగాణ ఎంపీల్లో ఎందుకు పోరాడటం లేదని పవన్ సూటిగా ప్రశ్నించారు.

దీంతో, అప్పటి దాకా ప్రత్యేక హోదా తెస్తాం, ఇస్తామని చెప్పిన నేతలు పవన్ కాకినాడ సభ తర్వాత మరింత రూటు మార్చారన గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇచ్చే బాధ్యత మాదేనని చెప్పిన బిజెపి హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్యాకేజీ ఇస్తున్నామని, హోదా ఇస్తే ఇబ్బందులు వస్తాయని మరింత స్పష్టంగా చెప్పేశారు.
ఇక, ప్రత్యేక హోదాతో లాభం కన్నా నష్టమే ఎక్కువ అని టిడిపి చెప్పడం గమనార్హం. పవన్ తిరుపతి సభ తర్వాత కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజీ పైన ప్రకటన చేశారు. దానిని చంద్రబాబు అర్ధరాత్రి స్వాగతించారని వైసిపి మండిపడింది. దానికి కౌంటర్గా టిడిపి... ఇచ్చిన ప్యాకేజీని స్వాగతిస్తామని, అలాగే హోదాతో పాటు రావాల్సిన వాటి పైన పోరాటం చేస్తామని చెప్పింది.
అయితే, పవన్ కాకినాడ సభ తర్వాత టిడిపిలోను మార్పు కనిపించిందని అంటున్నారు. కేంద్రమంత్రి సుజన సూటిగా.. హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పడం గమనార్హం. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించలేదని టిడిపి నేతలు వైసిపి పైన కాకినాడ సభకు ముందు మండిపడ్డారు. అదే చంద్రబాబు రెండు రోజుల క్రితం.. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలపడం గమనార్హం.
తెలంగాణ ఎంపీల్లా ఎందుకు పోరాడటం లేదని, ప్రత్యేక హోదా పైన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పారు. ప్యాకేజీని టిడిపి స్వాగతిస్తుందో లేదో వారిష్టమని కూడా కాకినాడ సభలో అన్నారు. వీటన్నింటికి సమాధానం చెప్పలేకే హోదా నుంచి ప్యాకేజీకి అధికార పార్టీలు రూటు మార్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, కొత్త రాష్ట్రమైన ఏపీ.. కేంద్రంతో సత్సబంధాలు కొనసాగించాలని, ఆ కారణంగానే ప్యాకేజీని స్వాగతిస్తున్నామనేది టిడిపి వాదనగా ఉంది. అందులోను నిజం ఉందనే వాదనలు లేకపోలేదు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో గట్టెక్కాలంటే ప్యాకేజీని అంగీకరించడమే ఉత్తమమని ఇంకొందరు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా పైన కేంద్రం స్పష్టత ఇచ్చాక తాను నిలదీస్తానని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో చెప్పారు. తాను ఆచితూచి మాట్లాడుతానన్నారు. చెప్పినట్లుగానే.. తిరుపతి సభ అనంతరం కేంద్రంలో కదలిక వచ్చినప్పటికీ.. అది హోదాతో సమానమైన ప్యాకేజీ అని చెప్పారు. ప్యాకేజీనే ఇస్తామని తేల్చి చెప్పడంతో కాకినాడ సభలో పవన్ విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications