పీవీపీ బీజేపీ వైపు చూస్తున్నారా, పవన్ కళ్యాణ్తో కుదిరేనా?
విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? అంటే కావొచ్చునని పలువురు భావిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పొగడటం వెనుక ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది.
పీవీపీకి ఎంపీ కావాలనే కోరిక అని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వినిపించింది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెనుక ఆయన ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. జనసేన తరఫున ఆయన పోటీ చేయాలనుకున్నారని, అది కుదరలేదనే ప్రచారం జరిగింది.
అంతకుముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్కు సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఆయనతో తేడా వచ్చింది. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ అది జరగలేదని అంటారు.
ఎంపీ కావాలనేది ఆయన కోరిక అనే వాదన ఉంది. దానికి తోడు వెంకయ్య ఆయన సినిమాలను పొగిడేస్తున్నారు. దీంతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారా అనే చర్చ సాగుతోంది. ఆయన నిర్మించిన ఊపిరి, బ్రహ్మోత్సవం సినిమాలపై వెంకయ్య ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.
ఆయన తెలుగుదేశం, వైసిపి వైపు, కాంగ్రెస్ వైపు వెళ్లే పరిస్థితి లేదని, అలాగే జనసేన వైపు కూడా వెళ్లే పరిస్థితి లేదని.. పోటీ చేయాలనుకుంటే ఆయనకు మిగిలింది బీజేపీ మాత్రమేనని అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ కుదరలేదని, పైగా పవన్కు దూరమయ్యారని అంటారు.
అదే సమయంలో 2019 నాటికి టిడిపి దూరమైనా.. పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉంటాయనే అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014లో చేయిచ్చిన పవన్.. 2019లో బీజేపీ నుంచి వస్తే సహకరించవచ్చునని అంటున్నారు.