పుట్టిన రోజు: వారు రాకముందే జగన్ వెళ్లిపోయారు, నేరుగా ఇంటికి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు శాసన సభ నుంచి వాకౌట్ చేయడం చర్చకు దారి తీస్తోంది. ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకే వాకౌట్ చేశారని అధికార పక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
సోమవారం జగన్ శాసన సభ నుంచి వాకౌట్ చేస్తామని ప్రకటించి బయటకు వచ్చేసే సమయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో సుమారు సగం మంది కూడా ఇంకా అసెంబ్లీకి చేరుకోలేదని చెబుతున్నారు. అప్పటికే జగన్ వాకౌట్ చేశారు.
జగన్ వాకౌట్ చేసి బయటకు వచ్చాక అక్కడకు కొందరు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ జగన్ను పుట్టిన రోజు అంటూ టార్గెట్ చేసింది. జగన్ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టిడిఎల్పీ సమావేశంలో అన్నారని తెలుస్తోంది.
అంతకుముందు శుక్రవారం నాడు కూడా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేతకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ఈ రోజు శుక్రవారం అని, ఆయన కోర్టుకు హాజరు కావాలని అందుకే పదేపదే సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని యనమల ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications