బెజవాడ రౌడీలు : దడ పుట్టిస్తున్నారు..
విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో రౌడీలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. మామూళ్ల పేరుతో సామాన్యులను బెంబేలెత్తిస్తున్నారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించే పేదలపై దాడులకు పాల్పడుతూ జులుం ప్రదర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా..! అధికారుల దృష్టికి ఎందుకు వెళ్లట్లేదన్న అనుమానాలు ఓవైపు తలెత్తుతుంటే.. మరోవైపు రోజురోజుకు తమ అరాచకాలను మరింత విస్తరించుకుంటూ పోతున్నాయి రౌడీ ముఠాలు.
తాజాగా విజయవాడలోని మొగల్రాజపురంలో రౌడీలు రెచ్చిపోయారు. మామూలు ఇవ్వడానికి నిరాకరించాడన్న కారణంతో ఓ కార్మికున్ని తీవ్రంగా కొట్టారు. కర్రలతో విరుచుకుపడ్డ నలుగురు రౌడీలు కార్మికునిపై దాడి చేయడం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. ఇంతకు కొద్దిరోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇల్లు కట్టుకుంటున్న బుల్లబ్బాయి అనే కార్మికుడు తమకు మామూలు చెల్లించలేదన్న కారణంతో అందరు చూస్తుండగానే అతనిపై దాడి చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అటువైపు తొంగి చూడట్లేదన్న వాదన వినబడుతోంది. మొగల్రాజపురంలో నివసించే కార్మికులు, కూలీ పని చేసుకునేవారి ఇళ్లన్నీ కొండపైనే ఉంటాయి. ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలన్నా..! ఇంటికి ఏదైనా మరమ్మత్తులు చేయించాలన్నా..! ఇంటికి అవసరమైన ఇసుకను కొండ కింద పోయించుకోవాల్సిందే. ఇదే అదనుగా భావించిన రౌడీ గ్యాంగ్ ఒకటి, కొండ కింద ఇసుక పోయించుకోవాలంటే తమకు మామూలు ముట్టజెప్పాల్సిందేనన్న షరతు విధించారు.
సురేష్ అనే వ్యక్తి ఈ రౌడీ గ్యాంగ్ కి నాయకుడిగా చెప్తున్నారు. ఇంటలిజెన్స్, డీజీపీ, లాంటి ఉన్నతాధికారులున్న రాజధాని ప్రాంతంలో ఇలాంటి ఘటనలు రాజధాని బ్రాండ్ కు డ్యామెజ్ చేస్తాయని అభిప్రాయపడుతున్నారు పలువురు. ఏదైమైనా.. రౌడీ గ్యాంగ్ ల హల్-చల్ తో నగరంలో పాత రౌడీయిజం మళ్లీ ఎక్కడ పురుడుపోసుకుంటుందేమోనని భయపడుతున్నారు స్థానికులు.