7న తిరుపతి నుంచి ప్రత్యేక రైలు.. హాల్ట్ స్టేషన్లు
Bhavya Gujarat Bharat Gaurav tourist train by IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. భవ్య గుజరాత్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. గుజరాత్ లోని ప్రఖ్యాత ఆలయాలను ఇందులో చేర్చింది. భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. తొమ్మిది రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది.
అక్టోబర్ 7వ తేదీన తిరుపతి/రేణిగుంట నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 639 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 350, 2ఏసీ- 52. తిరుపతి నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్కు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్, హుజూర్ సాహిబ్ నాందెడ్, పూర్ణ స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

ద్వారకా- సోమనాథ్- అహ్మదాబాద్- మొధేరా- పాటన్- స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం)ని దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నడయాడిన పుణ్యభూమి ద్వారక. 2,500 సంవత్సరాల కిందట శ్రీకృష్ణుని మునిమనవడు వజ్రనాభుడు ద్వారకాధీశుడి ఆలయాన్ని స్థాపించాడని నమ్ముతారు. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా ద్వారకాధీశుడి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజలు చేయవచ్చు.
అలాగే- చారిత్రాత్మక నాగేశ్వర ఆలయం, బెట్ ద్వారకా దేవస్థానాలను కూడా యాత్రీకులు సందర్శించవచ్చు. దీని తర్వాత సోమ్ నాథ్ లో సోమనాథేశ్వరుడి ఆలయాన్ని దర్శించవచ్చు. మొధెరాలోని ప్రతిష్ఠాత్మక సూర్య దేవాలయంలో పూజలు చేయవచ్చు. అలాగే- 11వ శతాబ్దంలో చాళుక్య సామ్రాజ్య చక్రవర్తి భీమా 1 నిర్మించిన అద్భుత కట్టడం రాణి కీ వావ్ ను సందర్శించే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా యాత్రీకులకు కల్పించింది ఐఆర్సీటీసీ. పాటన్ లో ఉందీ కట్టడం. భూమి లోపల కొన్ని వందల అడుగుల లోతున ఇది నిర్మితమైంది.
వంద రూపాయల నోటు మీద కనిపించేదే రాణి కీ వావ్. ఉక్కు మనిషి వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహ సందర్శన కూడా ఈ ప్యాకేజీలో ఉంది. ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 18,400 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 17,300 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీలో (3ఏసీ) పెద్దలకు 30,200, పిల్లలకు 28,900 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీలో (2ఏసీ) పెద్దలకు 39,900, పిల్లలకు 38,300 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications