ప్రధాని వస్తున్నారు.. ఆగస్టు 1న 'అల్లూరి' పేరు ప్రతిధ్వనించేలా
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగానికి గేమ్చేంజర్గా మారనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా నామకరణం చేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, గ్లోబల్ కనెక్టివిటీకి ఈ ఎయిర్పోర్టు సరికొత్త ద్వారాలు తెరువబోతోంది.
ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించగా, ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు మోదీ హామీ ఇచ్చారు.

సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సీఎం ప్రధాని మోదీకి పరిచయం చేయగా.. "ఈయన నాకు తెలుసు, ప్రతిరోజూ సైకిల్పైనే పార్లమెంట్కు వస్తుంటారు" అని ప్రధాని చిరునవ్వుతో వ్యాఖ్యానించడం విశేషం. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, తాజా రాజకీయ పరిస్థితులపై నాయకులిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
భోగాపురం ఎయిర్పోర్ట్.. ఉత్తరాంధ్రకు నిజమైన 'గ్రోత్ ఇంజన్'!
ఢిల్లీ పర్యటన అనంతరం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ ఎయిర్పోర్టు కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాకుండా, ఒక సంపూర్ణ ఏవియేషన్ హబ్గా రూపుదిద్దుకుందని చెప్పారు. ప్యాసింజర్ టెర్మినల్తో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీలను కూడా అదే రోజు ప్రారంభించనున్నారు.
ఎయిర్పోర్టుతో పాటు రాబోయే ఏఐ (AI) డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని, టూరిజం, లాజిస్టిక్స్ రంగాలు ఊపందుకుని వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు.
భూములిచ్చిన రైతులకు 'ఫ్రీ ఫ్లైట్' ఆఫర్..
ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, యజమానులను ప్రభుత్వం ఘనంగా గౌరవించనుంది. ఇందులో భాగంగా వారికి ఉచితంగా ఒకసారి విమాన ప్రయాణం (Free Flight) చేసే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే 9 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంట్లోనూ ఈ ప్రారంభోత్సవ స్ఫూర్తి నిండాలని, ఆరు జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని దీనిని ప్రజా ఉత్సవంగా నిర్వహించాలని ఆదేశించారు. అరకు కాఫీ ఘుమఘుమలు, స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, జానపద కళారూపాల ప్రదర్శనలతో ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచానికి చాటిచెప్పాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications