ద్యావుడా.. సీటు కోసం మాజీ మంత్రి 'ఎత్తు' అసాధారణం??
ఆ మాజీ మంత్రికి వచ్చే ఎన్నికల్లో సీటుంటుందో? లేదో? ఇంతవరకు స్పష్టత రాలేదు. ఎన్నిసార్లు అధినేతను కలిసినప్పటికీ మాములుగా మాట్లాడి పంపించివేస్తున్నారేకానీ సీటు విషయంలో హామీ ఇవ్వడంలేదు. ఇతర నాయకులకు, కొందరు ఇన్ ఛార్జిలకు మాత్రం సీటు మీదే పనిచేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. మాజీ మంత్రి విషయానికొచ్చేసరి అధినేత నుంచి ఆ హమీ రావడంలేదు.

సెల్ఫీ వీడియోతో తమవేనని చెబుతున్నారు..
వాస్తవ పరిస్థితి అలా ఉంటే సదరు మాజీ మంత్రి అయిన భూమా అఖిలప్రియ మాత్రం కర్నూలు జిల్లాలోని రెండు నియోజకవర్గాలు నంద్యాల, ఆళ్ళగడ్డ రెండూ తమవేనని కార్యకర్తలకు చెబుతున్నారు. అంతటితో ఊరుకోలేదు.. ఈ రెండు నియోజకవర్గాలు తమవేనని, ఆళ్లగడ్డ నుంచి తాను, నంద్యాల నుంచి తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీచేస్తాడని చెబుతూ సెల్ఫీ వీడియో తీసి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు పంపిస్తున్నారు. తనకే సీటు విషయంలో హామీ రాకపోతే రెండుసీట్లు తనవేనని ఎలా చెబుతారంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

తరుచుగా వివాదాల్లో నిలుస్తున్న అఖిలప్రియ
ఇటీవలి కాలంలో అఖిలప్రియ తరుచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఆమె భర్త భార్గవ్ తోపాట ఆమె కూడా కొన్ని వివాదాస్పద చర్యల్లో పాలుపంచుకున్నట్లు పార్టీ అధిష్టానం దగ్గర సమాచారం ఉంది. అందుకే ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ బదులుగా ఆమె బంధువు, బీజేపీ నాయకుడిగా ఉన్న కిషోర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని టికెట్ కేటాయించాలనే యోచనతో చంద్రబాబు ఉన్నారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో కిషోర్ రెడ్డి మంచిపేరు తెచ్చుకోవడం కూడా కలిసి వస్తోంది.

వివాదాస్పద నిర్ణయాలు, చర్యలు
భూమా నాగిరెడ్డి అన్న భాస్కర్ రెడ్డి కుమారుడే కిషోర్ రెడ్డి. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి జీవించి ఉన్న సమయంలో వారి వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలంతా కిషోర్ రెడ్డి వైపు ఉన్నారు. అఖిలప్రియ వీరిలో కొందరినీ కిషోర్ రెడ్డివైపు వెళ్లడంపై కూడా ప్రశ్నించింది. అఖిలప్రియ తరుచుగా కేసుల్లో ఇరుక్కోవడంతోపాటు వివాదాస్పదమైన నిర్ణయాలు, చర్యలవల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కష్టమని తేలడంతో చంద్రబాబు ప్రత్యామ్నాయంవైపు చూస్తున్నారు. అందులో భాగంగానే కిషోర్ రెడ్డికి సీటివ్వాలనే సూచనలు కూడా వచ్చాయి. చివరగా అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications