TTD పరకామణి చోరీ కేసులో బిగ్ టర్న్- శవమై తేలిన ఫిర్యాదు అధికారి..!
తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణి చోరీ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను గుర్తించి ఫిర్యాదు చేసిన అప్పటి టీటీడీ సహాయ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ పై గుర్తించారు. ఓవైపు హైకోర్టు నేరుగా ఈ కేసు విచారణను సమీక్షిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది.
2023లో టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవికుమార్ పరకామణిలో కానుకల లెక్కింపు సందర్బంగా చోరీకి పాల్పడటాన్ని గుర్తించిన ఏవీఎస్వో సతీష్కుమార్.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ వ్యవహారం తొలిసారి వెలుగుచూసింది. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీష్కుమార్ ఫిర్యాదు చేసారు. టీటీడీ పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా సతీష్కుమార్ పట్టుకున్నారు.

ఆ తర్వాత పోలీసులు దీనిపై తేలికపాటి సెక్షన్లతో సాధారణ దొంగతనంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లోక్ అదాలత్ లో ఈ వ్యవహారాన్ని అప్పటి టీటీడీ పెద్దలు రాజీ చేశారు. అప్పటి నుంచి దీనిపై వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరుగుతోంది. ఇందులో బాగంగా నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తుకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్కుమార్ ను పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సీఐడీ విచారించింది. మరోసారి విచారణకు రావాలని సతీష్కుమార్కు సీఐడీ నోటీసులు పంపింది. ఇలాంటి సమయంలో టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ అనుమానాస్పదంగా చనిపోయారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్పై ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టానికి పంపారు. దీంతో ఈ కేసులో బిగ్ టర్నింగ్ ఎదురైంది.












Click it and Unblock the Notifications