AP Liquor Scam: ఏపీ మద్యం స్కాం అసలు సూత్రధారి ఎవరో తేల్చేసిన సుప్రీంకోర్టు..!
ఏపీ మద్యం స్కాం (ap liquor scam) కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ హయాంలో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ద్వారా దాదాపు 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయిస్తోంది. ఈ క్రమంలో ఈ స్కాంకు సూత్రధారులంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేసింది.
మద్యం స్కాంలో సీఐడీ సిట్ ఏ1 నిందితుడుగా చేర్చిన రాజ్ కెసిరెడ్డి తాజాగా తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్ (సూత్రధారిి) రాజ్ కెసిరెడ్డే అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో రాజ్ కెసిరెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో తమ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు రాజ్ కెసిరెడ్డి తరఫు న్యాయవాది అనుమతి కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.

గతేడాది మద్యం స్కాం కేసులో అరెస్టు అయిన రాజ్ కెసిరెడ్డి 9 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ లభించినా.. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 750 కోట్లు మళ్లించిన షెల్ కంపెనీలతో రాజ్ కెసిరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు ఇవాళ ఆయన లాయర్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరగా.. సుప్రీంకోర్టు అంగీకరించింది.












Click it and Unblock the Notifications