ఓ పక్క అద్యక్షుడి జన్మదిన వేడుకలు..! మరో పక్క నేతల అసహనం..! వైసీపిలో విచిత్ర పరిస్థితి..!
హైదరాబాద్ : ఒకడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి పడుతున్న చందంగా తయారయ్యింది ఏపి ప్రతిపక్ష పార్టీ పరిస్థితి. పార్టీని ఎన్నికలకు సిద్దం చేస్తున్న తరుణంలో పార్టీ నేతలనుండి అనుకోని విధంగా ఇబ్బందులు తలెత్తున్నాయి. పార్టీ అద్యక్షుడి జన్మదిన వేడుకలను కొంతమంది నాయకులు ఉత్సాహంగా జరుపుకొంటుంటే., మరికొంత మంది అసంత్రుప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతన్న సందర్బంలో ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన నాయకులు ఎందుకు నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
వైసీపిలో విచిత్ర పరిస్థితులు..! సమన్వయ కర్తలకు నో టికెట్..!
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా ఏపీ ఓటర్లు ఆ పార్టీ షాక్ ఇచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకే జై కొట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షానికి పరిమితమైన ఆ పార్టీ ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఏడాది కాలంగా ప్రజాసంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అసంత్రుప్తిలో వైసీపి శ్రేణులు..! కొందరు పార్టీ వీడేందుకు ఏర్పాట్లు..!!
రాష్ట్రంలోని పరిస్థితులు.. వైసీపీ నేతల పనితీరుపై ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించిన జగన్.. దాని ఆధారంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సర్వే రిపోర్టులను చూసుకుని గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేసిన జగన్.. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో భాగంగా గతంలో ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా పని చేసిన వారిని కాదని కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. . దీంతో ఆ పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది.
నేతల మద్య కొరవడుతున్న సయోద్య..! సమస్యల్లో క్రిందిస్థాయి నాయకత్వం..!!
తాజాగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరొందిన హిందూపురంలో ఇప్పటి వరకు సమన్వయకర్తగా పని చేసిన నవీన్ నిశ్చల్ను కాదని టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి అవకాశం ఇచ్చారు ఆ పార్టీ అధినేత. దీంతో నవీన్ వైసీపీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో.. ఈ పరిస్థితిని గమనించిన పార్టీ అధిష్ఠానం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు కొందరు నేతలను మద్యవర్తిత్వం జరపాల్సిందిగా ఆదేశించింది.
జగన్ హామీ కోసం ఎదురు చూస్తున్న సమన్వయకర్తలు..!తర్వాతే భవిష్యత్ కార్యాచరణ అంటున్న నేతలు..!!
ఇందులో భాగంగానే హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కడపల శ్రీకాంత్రెడ్డి.. వైసీపీలో ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న వారు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులు కాదని చెప్పి బాంబు పేల్చారు. సమన్వయకర్తలు పార్టీని బలోపేతం చేసేందుకు నియమించినవారు మాత్రమే నని స్పష్టత ఇచ్చారు. శ్రీకాంత్రెడ్డి మాటలతో ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమన్వయకర్తల్లో ఆందోళన మొదలైంది. .లక్షల రూపాయలు వ్యయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని సమన్వయ కర్తలో ఆందోళన మొదలైనట్టు చర్చ జరుగుతోంది.