గుంటూరులో బంగారం షాపులకు వెళ్తున్నారా ? మీకోసమే ఈ అలర్ట్..!
ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన గుంటూరు నగరంలో బంగారం షాపుల్లో అక్రమాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు ఇవాళ దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో పలు అక్రమాలు బయటపడుతున్నాయి. నాణ్యతలేని బంగారు అభరణాలు, హాల్ మార్క్ ఉల్లంఘనలు ఇలా పలు అక్రమాలను గుర్తించారు. దీనిపై వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వినియోగదారులకు కూడా పలు సూచనలు చేస్తున్నారు.
గుంటూరు నగరంలోని లాలాపేట ప్రాంతంలో ఉన్న బంగారు దుకాణాలపై ఇవాళ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బృందం తనిఖీలు నిర్వహించింది. నగరంలోని బంగారు దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో ఈ అక్రమాలు నిజమేనని పలు చోట్ల తేలింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. వీటిపై బంగారు దుకాణాల నిర్వాహకుల్ని ప్రశ్నించడంతో పాటు కేసుల నమోదుకు ఆదేశాలు ఇచ్చారు.

గుంటూరులోని బంగారు దుకాణాల్లో పలు చోట్ల నిబంధనల్ని ఉల్లంఘించి నాణ్యతలేని నగల్ని విక్రయిస్తున్నట్లు తేలింది. అలాగే హాల్ మార్క్ లేకుండా నగలు అమ్మడం, నకిలీ హాల్ మార్క్ తో నగలు విక్రయించడం, నాణ్యతలో లోపాల్ని కూడా అధికారులు గుర్తించారు. వీటిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో నాణ్యతా ప్రమాణాల్ని వదిలేసి వినియోగదారులకు బంగారం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు బీఐఎస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కస్టమర్లు కూడా నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరిశీలించి కొనుగోళ్లు చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications