టీటీడీ ఆస్తుల పరిరక్షణకు బీజేపీ ఉపవాస దీక్ష.. భగ్గుమంటున్న బీజేపీ నేతలు
టీటీడీ భూముల వేలం తీర్మానం ఏపీలో రాజకీయ దుమారానికి కారణం అవుతుంది . ఇక తిరుమల శ్రీవారి ఆలయ భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షినారాయణ గుంటూరులో తన నివాసంలో ఉపవాస దీక్ష చేప్టటారు. ఇక కన్నా మాత్రమే కాదు బీజేపీ ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉపవాస దీక్షకు దిగారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు .
ఆలయ భూముల విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి
ఇక హిందూ దేవాలయాలకు, దేవాలయాల భూముల విషయంలో జోక్యం చేసుకుంటే బీజేపీ చాలా తీవ్రంగా పరిగణిస్తుందని ముందే హెచ్చరించామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ . సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ,ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీలో హిందూ ధర్మం మనుగడకు ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఏపీలో మతమార్పిడిల విషయంలో కానీ, దేవాలయాల భూముల విషయంలోకానీ వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, దీనిపై బీజేపీ స్పందించినప్పుడు ప్రభుత్వం ఒకడుగు వెనక్కి వేస్తోందని కన్నా అన్నారు.
దేవుడిని కూడా మోసం చేసే పనిలో సీఎం జగన్
ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఆలయ భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేసిందని పేర్కొన్నారు. మంగళగిరి లక్ష్మీనిరసింహస్వామి భూములు, అన్నవరంలో భూములు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు బీజేపీ వ్యతిరేకించిందని కన్నా గుర్తు చేశారు . నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన 888 జీవోపై కన్నా తీవ్ర విమర్శలు గుప్పించారు. అదొక పనికిమాలిన జీవో అని, దేవుడిని కూడా మోసం చేద్దామనే ఆలోచనతోనే సీఎం జగన్ ఉన్నారని , అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అని కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నించారు.
తాత్కాలిక నిలుపుదల కాదు ..శాశ్వత రద్దు చెయ్యాలి
బీజేపీ చేపట్టిన ఉపవాస దీక్షకు భయపడి టీటీడీ ఆలయ ఆస్తుల అమ్మకాల జీవోను రద్దు చేస్తూ జీవో 888 విడుదల చేసిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అన్నారు.ఇది కేవలం తాత్కాలిక నిలుపుదల మాత్రమే అని ఇక ఆలయ భూముల విక్రయాల జీవోను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీతో పాటు అనేక దేవాలయాల ఆస్తుల అన్యాక్రాంతమయ్యాయని దానిపై కూడా చర్యలు చేపట్టి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆలయాల ఆస్తులు అమ్మకుండా ఆర్డినెన్స్ తేవాలని బీజేపీ నేతల డిమాండ్
బీజేపీ ఎంపీ జీవీఎల్ దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా జీవీఎల్ భవిష్యత్లో ఆలయాల ఆస్తులు అమ్మకుండా ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములు అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు . టీటీడీ భూముల వేలం నిర్ణయం పూర్తిగా ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఇది భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడమంటే ప్రభుత్వం దివాళా తీసినట్టేనని చెప్పారు. దేవాలయ భూములు విక్రయించాలనే ప్రభుత్వ ఆలోచన శాశ్వతంగా విరమించుకోవాలన్నారు.