పొత్తు పై బీజేపీ తాజా ప్రతిపాదన - చంద్రబాబు సిద్దమేనా..!!
ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు భేటీ తరువాత ఎన్డీఏలో టీడీపీ చేరటం ఖాయమని అందరూ భావించారు. కానీ, పొత్తు పైన స్తబ్దుత కొనసాగుతోంది. ఈ సమయంలోనే బీజేపీ నుంచి టీడీపీకి తాజా ప్రతిపాదన అందింది. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పొత్తును డిసైడ్ చేయనుంది.
పొత్తుల లెక్కలు : ఏపీలో జగన్ సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన 2014 పొత్తుల తరహాలో బీజేపీ తమతో కలిసి రావాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తరువాత అధికారికంగా రెండు పార్టీలు స్పందించకపోయినా..ఎన్డీఏలో టీడీపీ చేరుతోందని ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరి భేటీ జరిగిన పది రోజులు అయినా పొత్తు పైన ఎలాంటి నిర్ణయం బయటకు రాలేదు. ఈ సమయంలోనే పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేసారు. అదే సమయంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని..ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లాల్సి వస్తుందని పరోక్షంగా పొత్తు పైన సంకేతాలు ఇచ్చారు.

బీజేపీ కోరుతున్న సీట్లు : ఇక, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఎన్ని సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వాలనేది చంద్రబాబు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. జనసేనకు 25 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ పొత్తులో చేరితే 10 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల పైన నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. కానీ, సీట్ల విషయంలో బీజేపీ నుంచి తాజాగా మరో ప్రతిపాదన టీడీపీకి అందినట్లు సమాచారం. తమకు 20 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ స్థానాల్లో విశాఖ, నర్సాపురం, రాజమండ్రి, విజయవాడ, హిందూపురం, రాజంపేట లేదా తిరుపతి కోరుతున్నారు. అదే విధంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను ప్రతిపాదించారు. అందులో రాజమండ్రి సిటీ, పి గన్నవరం (ఎస్సీ), కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ ఉన్నాయి.

చంద్రబాబు అంగీకరిస్తారా : వీటితో పాటుగా తిరుపతి లేదా శ్రీకాళహస్తి, మదనపల్లె, వైజాగ్ నార్త్, అరకు, శ్రీకాకుళం, నెల్లూరు సిటీ లేదా రూరల్, ఒంగోలు, నర్సరావుపేట, ప్రత్తిపాడు, బాపట్ల, కాకినాడ సిటీ, ఏలూరు, జమ్మలమడుగు, ధర్మవరం ఇవ్వాలనేది బీజేపీ తాజా డిమాండ్. అయితే, ఈ జాబితాలో మెజార్టీ సీట్లు టీడీపీ బలంగా ఉన్నవి. దీంతో, బీజేపీకి కేటాయించటం పైన చంద్రబాబు మార్పులు సూచిస్తున్నట్లు సమాచారం. దీని పైన చర్చించేలా పవన్ బాధ్యత తీసుకున్నా..ఢిల్లీ పర్యటన పైన సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు నుంచి సీట్ల కేటాయింపు పైన స్పష్టత వచ్చిన తరువాతనే పొత్తు పైన అధికారిక నిర్ణయం ఉంటుందని బీజేపీ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications