ప్రత్యేక హోదాకు నో ఛాన్స్- చంద్రబాబు ఆ తప్పిదం వల్లే- పురంధేశ్వరి కామెంట్స్
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకాలేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా సీఎంలు చంద్రబాబు, వైఎస్ జగన్ కేంద్రం వద్ద పలుమార్లు లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటూ ప్రతిపాదించిన కేంద్రం.. దానికి చట్టబద్ధత ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఓవైపు ఏపీ ప్రభుత్వం ఇంకా ప్రయత్నాలు చేస్తుండగానే బీజేపీ జాతీయ నేతగా ఉన్న పురందేశ్వరి ఆ ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టేశారు.
ప్రకాశం జిల్లాకు వచ్చిన పురందేశ్వరి.. ఏపీకి ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ సహా ఏ రాష్ట్రానికీ ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం గతంలో ప్రకటించిన ప్యాకేజీని గత సీఎం చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని కూడా పురందేశ్వరి గుర్తుచేశారు.
మరోవైపు ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయని బీజేపీ నేత పురందేశ్వరి ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజల కోసం ఉపయోగించాలంటూ వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే బీజేపీ నేతలు కేంద్ర నిధుల వినియోగం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో పురందేశ్వరి మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.