సంచితకు మరో ఆఫర్: మొన్న సింహాచలం ట్రస్టు బోర్డులో చోటు..నేడు మన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్గా..!
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు కుటుంబానికి చెందిన సంచిత గజపతి రాజుకు మరో ఆఫర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. విజయనగరం జిల్లాల్లో ప్రతిష్ఠాత్మకమైన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్సాస్) ట్రస్టు ఛైర్ పర్సన్గా సంచిత గజపతి రాజును నియమించింది. కొద్దిరోజుల కిందటే సింహాచలం దేవస్థానం పాలక మండలిలో సంచితకు చోటు కల్పించిన ప్రభుత్వం.. ఈ సారి మన్సాస్ ట్రస్ట్ పగ్గాలను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
1958లో గజపతి రాజుల వంశానికి చిట్టచివరి క్రౌన్డ్ ప్రిన్స్ పూసపాటి విజయ్ రామ్ గజపతి రాజు ఈ మన్సాస్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ గజపతి రాజుల కుటుంబానికి చెందిన వారే దీనికి ఛైర్మన్లుగా ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం టీడీపీ సీనియర్ నాయకుడు అశోక గజపతి రాజు ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ట్రస్ట్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది..
Recommended Video
ఈ పరిస్థితుల్లో అశోక గజపతి రాజును తొలగించి.. సంచితకు స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. బుధవారమే ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అశోక గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు కుమార్తె సంచిత. రెండేళ్ల కిందటే ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమెను దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆమెను సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా నియమించింది. తాజాగా మన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్గా నియమించడం ఆసక్తిగా మారింది.