AP NDA Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ..? కనిపించని పురందేశ్వరి- ఏంటా అసంతృప్తి..?
TDP Janasena BJP Manifesto: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించింది. నవరత్నాలు ప్లస్ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల కిందటే దీన్ని విడుదల చేశారు.

తాజాగా తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి మేనిఫెస్టో విడుదల అయింది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి కిందటే ఆవిష్కరించారు. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్.. వారి వెంటే ఉన్నారు గానీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి ఆయన ముందుకు రాలేదు.
టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కీలక హామీలు ఉన్నాయి. నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి, సంవత్సరానికి ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ 15,000 రూపాయలు చొప్పున నగదు బదిలీ వంటివి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి.
అలాగే- ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతినెలా 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 వేలు పంపిణీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు, బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి 10,000 కోట్ల రూపాయల మంజూరు చేస్తామని కూటమి ప్రకటించింది.

మేనిఫెస్టోను పట్టుకునేందుకు అయిష్టత
మేనిఫెస్టో విడుదల సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్తో కలిసి దీన్ని విడుదల చేయడానికి బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ముందుకు రాలేదు. మేనిఫెస్టో కాపీని ఆయనకు అందజేసినప్పటికీ ఆయన దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. వద్దన్నట్లు చేతులు ఊపారు.
ఏపీలో జరిగే రాజకీయ పరిణామాల గురించి నేరుగా బీజేపీ అధిష్ఠానానికి రిపోర్ట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అత్యంత విశ్వసనీయుడిగా పేరుందాయనకు. అలాంటి నేత- తమ ఉమ్మడి కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను ఆవిష్కరించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కర్నాటక తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో
ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ కూడా పొరుగునే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోన్నవే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకుని నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతినెలా నగదు పంపిణీ.. వంటి హామీలన్నీ కాంగ్రెస్కు చెందినవే. వాటిపై పేటెంట్ రైట్స్ అన్నీ కూడా కాంగ్రెస్వే.
అలాంటి హామీలను తమ కూటమి మేనిఫెస్టోలో చేర్చడమే బీజేపీ అసంతృప్తికి కారణం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ మేనిఫెస్టోను తాము సమర్థించితే కాంగ్రెస్ ఉచిత విధానాలతో తాము ఏకీభవించినట్టవుతుందనే నిర్ణయానికి బీజేపీ వచ్చిందని, అందుకే సిద్ధార్థ్ నాథ్ సింగ్.. దీన్ని ఆవిష్కరించడానికి నిరాకరించారని అంటున్నారు.
ఇదే మేనిఫెస్టోతో ఎన్నికలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఈ కూటమిలో బీజేపీ ఉంటుందా? ఉండదా? అనేది చర్చనీయాంశమౌతోంది. అదే సమయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కోసం కట్టిన బ్యానర్లో కూడా ఎక్కడే గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలను ముద్రించకపోవడం కూడా సిద్ధార్థ్ నాథ్ సింగ్ అసంతృప్తికి కారణమైందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications