మంత్రి పత్తిపాటి ఇల్లు ముట్టడి: 'ఆ ఒక్క పథకాన్నే చంద్రబాబు వదిలేశారు'
అమరావతి: ఏపీలో కేంద్రం నిధులతో అమలు చేసే పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పెట్టడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేంద్రం నిధులతో అమలు చేసే పథకాలకు చంద్రన్న పేరు పెట్టడాన్ని విజయవాడ బీజేపీ నగర అధ్యక్షుడు డాక్టర్ ఉమామహేశ్వర్రాజు విరుచుకుపడ్డారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న మరుగుదొడ్ల పథకాన్ని మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలేశారని ఎద్దేవా చేశారు. దానికి కూడా చంద్రన్న మరుగుదొడ్ల పథకం అని పెడితే ఎంతో బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.
కౌలు రుణాలు రద్దు చేయాలంటూ మంత్రి పత్తిపాటి ఇల్లు ముట్టడి
కౌలు రుణాలు రద్దు చేయాలంటూ గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొందరు రైతులు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని శనివారం ముట్టడించారు. వందలాదిగా వచ్చిన రైతులు మంత్రి నివాసం ముందు బైఠాయించి పత్తిపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే, వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. మంత్రి తన నివాసంలో లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఆయన ఆందోళన చేస్తున్న రైతులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
రాజధాని రైతుల ఆందోళన
అధికారులు తమ సమస్యలు పట్టించుకోవటం లేదంటూ రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో 'రాజధాని భూసేకరణ- సామాజిక ప్రభావం' అనే అంశంపై అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఈ సదస్సు ఎందుకు పట్టారంటూ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందుగా తమ ఇబ్బందులను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సదస్సు వద్దకు చేరుకుని రైతులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకితీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications