ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిప్ట్ అవ్వటం, లోకేష్ పాదయాత్ర పైన బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసారు.
విశాఖే ఏపీ రాజధాని...సీఎం వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. విశాఖ ఏపీ రాజధానిగా చెబుతూ..తాను త్వరలో అక్కడకే షిప్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ తాజాగా ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అనే విషయంలో బీజేపీ నిర్ణయాలో ఎటువంటి మార్పు లేదని జీవీఎల్ స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విశాఖకు వస్తే అక్కడే రాజధాని అనటం సాంకేతికంగా కుదరదని పేర్కొన్నారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధానిగా ఉంటుందని ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
పొత్తులపైనా జీవీఎల్ స్పందించారు. ఎవరు ఎన్ని చెప్పిన జనసేనతోనే మా పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసారు. తమ రెండు పార్టీలే ముద్దని పేర్కొన్న జీవీఎల్.. మూడో పార్టీ వద్దనదే తమ విధానమని పరోక్షంగా టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. జనసేన,బీజేపీ కూటమిపై మీడియాకు అనుమానాలు తప్ప మాకు ఎటువంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు. వైజాగ్ మెట్రో ఆలస్యం అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని జీవీఎల్ ఆరోపించారు.
కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ఎంపీలకు అవగాహన సదస్సు అవసరం అనిపిస్తోందని ఎద్దేవా చేసారు. ముందు సీఎంకు మెట్రో పై వినతి పత్రం ఇవ్వాలని సూచించారు. జనసేన- టీడీపీ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ బీజేపీ నేతలు పవన్ తమతోనే ఉంటారని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ తమ పొత్తు జనసేనతో లేదంటే జనంతో ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర పైన జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలన్నారు, రుద్దుడు కార్యక్రమంతో నాయకత్వం రాదని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రకు అనుకున్నంత మైలేజ్ రావడం లేదని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయని పేర్కొన్నారు. పాదయాత్ర పైన పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికే సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీంతో..ఎక్కువగా విశాఖ కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో జీవీఎల్ హాజరవుతున్నారు. జనసేనతో పొత్తు విషయంలో పవన్ స్పష్టత ఇచ్చే వరకూ వేచి చూడాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.