పవన్ కళ్యాణ్తో బీజేపీ యువ ఎంపీల భేటీ: అసలేం జరుగుతోంది?
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ సినీనటుడు. ఆయనకు దాదాపు అన్ని రంగాల్లోనూ అనేక మంది అభిమానులున్నారు. ఆయనను రాజకీయ నాయకుడిగా కంటే సినీ హీరోగానే అభిమానించేవారు ఎక్కువగా ఉన్నారు. రాజకీయ నేతల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే గాక, ఇతర రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ను ఆరాధించేవారున్నారు.

పవన్ కళ్యాణ్తో బీజేపీ యువ ఎంపీలు..
తాజాగా పవన్ కళ్యాణ్తో యువ రాజకీయ నేతలు దిగిన ఫొటోనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జనసేనానితో బీజేపీకి చెందిన ఇద్దరు యువ ఎంపీలు ఆదివారం కలిశారు. కర్ణాటకలోని బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా.. పవన్ కళ్యాణ్ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పవన్ అంటే అభిమానమంటూ..
మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా.. పవన్ కళ్యాణ్తో కలిసిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నేను ఆయన(పవన్ కళ్యాణ్) సినిమాలను చూసేవాణ్ని. కాలేజీ రోజుల్లో ఆయన్నెంతగానో అభిమానించేవాణ్ని. ఈ రోజు నేను, తేజస్వి సూర్య ఆయన్ను కలిసి మాట్లాడే అవకాశం లభించింది. థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్, విశ్వ గారూ' అని ప్రతాప్ సింహా ట్వీట్ చేశారు. నాదెండ్ల మనోహర్ కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు.

బీజేపీ పెద్దలకు సానుకూలంగా..
కాగా, పవన్ కళ్యాణ్ ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోడీ, అమిత్ షాలంటే తనకు అభిమానమని అన్నారు. దేశంలో ఎప్పట్నుంచో ఉన్న సమస్యలకు వారు పరిష్కారం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అంతేగాక, ఏపీ రాజధాని సహా పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై సరైన రీతిలో స్పందించకుంటే.. ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు.
బీజేపీ వైపు చూస్తున్నారా?
ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గమనించిన రాజకీయ విశ్లేషకులు ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను బీజేపీ యువ ఎంపీలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానంతో కలిశారా? లేక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, జనసేన మధ్య రాజకీయ చర్చ ఏమైనా జరిగిందా? అనేది రాబోయే కాలంలో స్పష్టత అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications