రుద్రాక్షలపై చైనా కన్ను.. శివుడి కన్నీటి బిందువుల గోడు!
హిమాలయాల ఒడిలో పుట్టి, శివుడి కన్నీటి బిందువులుగా.. ఆధ్యాత్మికతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే పవిత్ర 'రుద్రాక్ష' వెనుక ఇప్పుడు ఒక చీకటి వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. పూజా గదుల నుంచి చైనా ఫ్యాషన్ మార్కెట్కు చేరిన రుద్రాక్ష.. నేడు కోట్లాది రూపాయల కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ విపరీతమైన డబ్బు ఆశ భక్తిని వ్యాపారంగా మార్చేసింది. చైనా వ్యాపారుల కోరికల మేరకు రుద్రాక్షల సైజు, ఆకృతిని మార్చడానికి నేపాల్లోని రైతులు చెట్లకు 'రసాయన ఇంజెక్షన్లు' ఇస్తున్నారనే సంచలన నిజం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నేపాల్లోని భోజ్పూర్ జిల్లా పరిధిలో ఉన్న సదానంద మున్సిపాలిటీని 'రుద్రాక్షల రాజధాని'గా పిలుస్తారు. ఇక్కడ లక్షలాది రుద్రాక్ష చెట్లు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు కేవలం సాధువులు, భక్తుల కోసం మాత్రమే సాగిన ఈ సాగు.. ఇప్పుడు చైనా మార్కెట్ ఎంట్రీతో రూ. 100 కోట్ల భారీ వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. పూర్వం రుద్రాక్షలను భక్తి భావంతో పవిత్రమైన పూజా వస్తువుగా చూసేవారు. కానీ ప్రస్తుతం, చైనా కొనుగోలుదారులు వీటిని అత్యంత ఖరీదైన ఆభరణాలుగా, ఫ్యాషన్ చిహ్నాలుగా భావిస్తున్నారు. చైనా వ్యాపారులు అడిగిన ఆకృతుల్లో రుద్రాక్షలు ఉంటే.. వారు ఒక్కో గింజకు లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఈ దృక్పథం మారడం వల్ల, రుద్రాక్ష గింజలకు విపరీతమైన ధరలు పలుకుతున్నాయి. ఈ అకస్మాత్తు ఆర్థిక మార్పు స్థానిక రైతుల సాగు పద్ధతులను పూర్తిగా మార్చేసింది.

పవిత్ర వృక్షాలకు హార్మోన్ల షాక్!
ఈ భారీ ఆదాయాన్ని వదులుకోలేక నేపాల్ రైతులు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికారు. రుద్రాక్ష గింజలు ఆకర్షణీయమైన రూపాన్ని, పెద్ద సైజును సంతరించుకునేలా చేయడానికి 'ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్' (PGR) అనే ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారు. రుద్రాక్ష చెట్టుకు మొగ్గలు వచ్చి పిందెలుగా మారే దశలో.. వాటిపై ఏకంగా నాలుగు సార్లు ఈ రసాయన మందులను ఇంజెక్ట్ చేస్తున్నారు. వ్యాపారులు అడిగే ప్రత్యేకమైన ఆకృతుల కోసం రైతులు ఈ మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించాల్సి వస్తోంది.
"సహజ పద్ధతిలో పెరిగిన రుద్రాక్షలు చైనా వ్యాపారుల ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండవు. అందుకే రసాయనాలు వాడటం అనివార్యమైంది. అలా చేస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది, లేకపోతే మాకు భారీ నష్టం తప్పదు" - స్థానిక రైతు అశోక్ కర్కీ.
చట్టవిరుద్ధమైన బ్లాక్ మార్కెట్.. ప్రభుత్వ నిషేధం!
దురదృష్టవశాత్తు, నేపాల్ ప్రభుత్వం ఈ రసాయనాల వాడకాన్ని అధికారికంగా అనుమతించలేదు. అయినప్పటికీ, రైతులు దొంగచాటుగా బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ మందులను సేకరించి వాడుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేసి వీటిని స్వాధీనం చేసుకుంటున్నా, లాభాల కోసం రైతులు మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. ఇది వారిని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది.
ఐదేళ్లలో చెట్లు శ్మశానాలేనా? నిపుణుల హెచ్చరిక
రసాయనాల అతివాడకం వల్ల రుద్రాక్ష చెట్ల ఆయుష్షు దారుణంగా పడిపోతోందని వ్యవసాయ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల ఆయుష్షు తగ్గి, అవి త్వరగా ఎండిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాబోయే నాలుగైదు ఏళ్లలో చెట్లు ఫలాలను ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది పర్యావరణపరంగానే కాకుండా, భవిష్యత్తులో ఈ పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.
రుద్రాక్ష చెట్లు సహజసిద్ధంగా పెరగడానికి ఏడేళ్ల సమయం పడుతుంది. ఇవి సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉత్తమంగా పెరుగుతాయి. చైనా వాణిజ్య అవసరాల కోసం వీటి సహజ సిద్ధతను దెబ్బతీస్తూ చేస్తున్న కృత్రిమ మార్పులు, అంతర్జాతీయ స్థాయిలో ఈ పంటపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు














Click it and Unblock the Notifications