ప్రధాని విశాఖ పర్యటన వేళ ట్విస్ట్ - కీలక భేటీలతో.!!
ప్రధాని మోదీ మరి కొద్ది గంటల్లో విశాఖ రానున్నారు. ప్రధాని పర్యటన వేళ..బీజేపీ నేతలు విశాఖలో ఘన స్వాగతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రి 7.25 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. దానికి రెండు గంటల ముందే సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖకు వస్తారు. విమానాశ్రయంలోనే కాసేపు విశ్రాంతి తీసుకొని, ప్రధాని రాగానే ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. గవర్నర్ కూడా విశాఖ రానున్నారు. తమిళనాడు మధురై నుంచి విశాఖ చేరుకున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ రోడ్ షో కు బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్దం చేసారు.
విమానాశ్రయం నుంచి ప్రధాని బస చేసే తూర్పు నౌకా దళ కేంద్ర కార్యాలయ ఆవరణలో ఉన్నచోళ సూట్ గెస్ట్ హౌస్ వరకు ఈ రోడ్ షో కోసం ప్లాన్ చేసారు. ఇందు కోసం పార్టీ ఏర్పాటు చేసిన రోడ్ షో లో ప్రధాని పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ప్రధాని అధికారిక షెడ్యూల్ లో ఈ అంశం ప్రస్తావించలేదు. కానీ, బీజేపీ నేతలు మాత్రం అన్ని ఏర్పాట్లతో సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఈ రాత్రి సీఎం జగన్ - ప్రధాని భేటీ జరగనుంది. రెండో రోజు ఉదయం పార్టీ నేతలతో ప్రధాని సమావేశం కానున్నారు.

ఆ సమయంలో ఏపీలో రాజకీయ పరిస్థితులపైన ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ తోనూ భేటీ కానుండటంతో..ముందుగానే పార్టీ నేతలతో సమావేశమై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ తో భేటీ తరువాత మరోసారి బీజేపీ నేతలు ప్రధానితో సమావేశం అవుతారని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ -జనసేన పొత్తు వార్తల వేళ..ఈ భేటీలో ప్రధాని ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. రెండో రోజు ప్రధాని పాల్గొనే బహిరంగ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. జనసమీకరణ బాధ్యతలను స్థానిక వైసీపీ నేతలకు అప్పగించారు.
ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఉదయం ప్రధాని చోళ గెస్ట్హౌస్ నుంచి నేవీ హెలికాప్టర్లో బయల్దేరి 10.20 గంటలకు సభాస్థలికి వస్తారు. 11.45 గంటల వరకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సభలోనే ముఖ్యమంత్రి జగన్.. ఆ తరువాత ప్రధాని ప్రసంగాలు ఉంటాయి. ప్రసంగాల సమయంలో సీఎం జగన్ ఏపీకి సంబంధించిన అంశాలు ప్రస్తావించనున్నారు. ప్రధాని స్పందన ఏంటనేది చూడాల్సి ఉంది. ఇక, బహిరంగ సభ పూర్తయిన తరువాత ప్రధాని హెలికాప్టర్లో బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి తెలంగాణ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం జగన్ ప్రధానికి వీడ్కోలు పలికిన తరువాత తాడేపల్లి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications