పని కానివ్వండి!: రాజధానిపై బాబుకి బిజెపి, కెసిఆర్కు..

ఒకసారి స్పష్టత వచ్చినపుడు దానిని తేల్చకుండా అదే పనిగా రాజధాని అంశంపై చర్చ పెట్టడం భావ్యం కాదని బిజెపి చెబుతోంది. రాజధాని ఎక్కడ నిర్మించాలో తెలియకపోతే పరిస్థితి వేరు, ఎక్కడనేది తేలిపోయింది కనుక ఇక జాప్యం చేయకుండా వెంటనే రాజధాని నిర్మాణ పనులు చేపట్టడం మంచిదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు.
రాష్ట్ర విభజన గోదావరి నది కన్నీళ్లను మిగిల్చిందని ఆయన అన్నారు. భద్రాచలం , పాల్వంచ రెవిన్యూ డివిజన్లో ముంపు గ్రామాల్లో నివసిస్తున్న 55వేల గిరిజనులను పునరావాసం కోసం 90 వేల ఎకరాలు కావాలని, ఆర్డినెన్స్ ఇచ్చిన ఏడు మండలాల్లో ముంపు గ్రామాలు మినహాయిస్తే మిగిలిందంతా అటవీ ప్రాంతమే అన్నారు.
ఈ మండలాల్లోని అశ్వరావుపేట, సత్తుపల్లి, దుమ్ముగూడెం, దమ్మపేట, చర్ల , వెంకటాపురం, ములకలపల్లి గ్రామాల ప్రజలను ఆశ్వాపురంలో పునరావాసం చేయాలని చూస్తున్నారని, పునరావాసానికి కావల్సిన 90 వేల ఎకరాల్లో 60 వేల ఎకరాలు వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, వేజేడు మండలాల్లో ఉందని, యదార్ధంగా 1959 వరకూ 4 మండలాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిలాలో ఉండేదని గుర్తు చేశారు.
అప్పటి ప్రభుత్వం ఆ గ్రామాలను ఖమ్మంలో కలిపిందని ఆ విషయం మరిచిపోతే ఎలా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన రాష్ట్ర నిర్మాణంపై దృష్టిసారించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ను అనాథగా చూడటాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications