హ్యాట్రిక్ కోసం బొత్స దంపతులు, బరిలో ఇద్దరు రాజులు
విజయనగరం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి మూడోదఫా బరిలోకి దిగుతుండగా, ఆయన సతీమణి సిట్టింగ్ పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ మూడోసారి విజయనగరం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.
వీరిద్దరూ గతంలో వరుసగా రెండుసార్లు అవే స్థానాల నుంచి విజయం సాధించారు. ఈ దఫా కూడా గెలిచి హాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడిందన్న వాదన ఉంది.

అయితే తాము చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు, తమ క్యాడర్ తమను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. విజయనగరం లోకసభ స్ధానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఝాన్సీ, టిడిపి అభ్యర్థిగా పూసపాటి అశోక గజపతిరాజు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఆర్విఎస్ఎస్కెకె రంగారావు బరిలో ఉన్నారు.
దీంతో ఈ దఫా విజయనగరం లోకసభ స్థానానికి రాజరిక వంశానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు తొలిసారిగా బరిలో దిగుతున్నారు. గతంలో అశోక గజపతిరాజు ఎమ్మెల్యేగా ఏడుసార్లు విజయం సాధించినప్పటికీ లోకసభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. లోకసభలో త్రిముఖ పోటీ నెలకొంది.












Click it and Unblock the Notifications