గుర్తుకు లేదా?: జగన్ ఇటలీ వ్యాఖ్యలపై బొత్స, జగ్గారెడ్డి
సమైక్యవాదిగా మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ఆయన వైయస్ విజయమ్మ తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. తమకు తెలంగాణ ఇచ్చే శక్తి లేదని, ఇస్తే అభ్యంతరం లేదని చెప్పిన మాటను జగన్ మరిచారా అని ప్రశ్నించారు.
సోనియా సంతకం చేసిన బిఫారం తీసుకున్నప్పుడు ఇటలీ సోనియా అనే విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆయన తండ్రిని రెండుసార్లు సిఎంని చేసినప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకించి సమైక్యవాదం వినిపిస్తున్నారని ఆయనే నిజమైన సమైక్యవాది అన్నారు.
కుర్చీ కోసమే: బొత్స
రాష్ట్రంలో అధికారం కోసమే వైయస్ జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారని, కుర్చీ కోసమే సమైక్యగళం వినిపిస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్తో ముప్పై ఏళ్ల సోనియా అనుబంధం గురించి మాట్లాడుతున్న జగన్కు, ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలని కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల అనుబంధం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు.
జగన్ జైల్లో ఉన్న సమయంలో గుంటూరులో విజయమ్మ నిరాహార దీక్ష చేసినప్పుడు శిబిరంలో సమన్యాయం బ్యానర్ ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అందరి అభిమతమని, దీనిపై అధిష్ఠానానికి తమ వాదన స్పష్టంగా వినిపించామని బొత్స చెప్పారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి రాసిన లేఖతో రాష్ట్ర విభజన ఆగుతుందా లేదా అనేది తాను చెప్పలేనని, ఆగుతుందనే తాను ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు.