మనం చెప్పి..కానీ:టి నోటీస్పై కిరణ్తో విభేదిస్తూనే బొత్స
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మంగళవారం విభేదించారు. బిల్లు పైన చర్చించాలని మనమే అన్నప్పుడు తిరిగి పంపించాలని ఎలా చెబుతామని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
పలువురు సీమాంధ్ర నేతలతో బొత్స భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కిరణ్ ఇచ్చిన నోటీసు పైన స్పందించారు. చర్చించాలన్నప్పుడు తిప్పి పంపించాలని ఎలా చెబుతామన్నారు. అదే సమయంలో సభా నాయకుడిగా ముఖ్యమంత్రికి ఎలాంటి నోటీసు ఇచ్చే అధికారమైనా ఉందని చెప్పారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తీర్మానం, ఓటింగ్ విషయాల్లో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలకు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పారు. మంత్రులకు ఎవరికైనా ఏ విషయంలోనైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వవచ్చునని లేదా సభలో వ్యక్తిగతంగా చెప్పవచ్చునని సూచించారు.
సభా నాయకుడిగా మాత్రం కిరణ్కు నోటీసు ఇచ్చే అధికారం ఉందని చెప్పారు. బిల్లు పైన చర్చించి, దానిని వ్యతిరేకించి ఓటింగ్ జరపాలన్నది తమ విధానం అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అందరూ సమైక్యవాదులే అన్నారు. మరోవైపు మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిలు రాజ్యసభ ఎన్నికలపై మంతనాలు జరుపుతున్నారు.