బాబుకు ఝలక్: 'ఆ సర్వే అంతా ఊహాజనితం', సీనియర్లతో జగన్ అత్యవసర భేటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న సర్వే పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టి పారేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న సర్వే పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ సర్వే అంతా అవాస్తవమని చెప్పారు. ఆ సర్వే అంతా ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందించాలని బొత్స అన్నారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే నోట్ల రద్దు అని ఆయన ఆరోపించారు.
సర్వే షాక్: బిజెపికి కటీఫ్ చెప్తే టిడిపికి ఎక్కువ సీట్లు, జగన్, పవన్ వెనకబాటు!
పార్టీ నేతలతో జగన్ భేటీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయ సాయి రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. సర్వే నేపథ్యంలో వారితో జగన్ భేటీ అయ్యారని తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వే చేశామని చెబుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అందుకు సంబంధించిన వివరాలు ఇచ్చింది. నియోజకవర్గాల్లో సర్వే చేసినట్లు తెలిపింది.
ఈ సర్వేలో రెండున్నరేళ్ల కిందటి పరిస్థితికి, ఇప్పటికి తేడా లేదని తేలిందని చెప్పింది. టిడిపి బలం తగ్గలేదని, అలాగని పెరగలేదని, యథాతథంగా ఉన్నట్లు సర్వేలో తేలిందని పేర్కొన్నారు. అయితే, వైసిపికి మాత్రం కాస్త పట్టు తగ్గినట్లు తేలిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ 23 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ఆయా నియోజకవర్గాలలో 2014 ఎన్నికల్లో వైసిపికి 43.2 శాతం ఓట్లు రాగా, తాజా సర్వేలో 36.8 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాలో మాత్రం టిడిపికి భారీ ఆధిక్యం వస్తుందని, రాయలసీమలో వైసిపికి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు సర్వేలో తేలిందని పేర్కొంది.