రోజా బరి తెగించిన మహిళ, ఎలా క్షమిస్తాం?: బుచ్చయ్య చౌదరి వ్యాఖ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యవహారంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో రోజా ఆ రోజు ప్రవర్తించిన తీరును మరోసారి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిందించారని, స్పీకర్ పోడియం చుట్టుముట్టారని ఆయన గుర్తు చేశారు. ఆఖరికి తమను కూడా చెప్పలేని మాటలు అన్నారని బుచ్చయ్య తెలిపారు. ఈ విధంగా బరితెగించి రోజా మాట్లాడితే ఎలా క్షమించాలని ఆయన అడిగారు.
మహిళలను గౌరవిస్తాం, పైకి రావాలని కోరుకుంటాం గానీ అన్నింటికి తెగించిన మహిళగా ఆమె ఉంటే ఏవిధంగా గుర్తించాలి, గౌరవించాలని ఆయన అన్నారు. చట్ట సభలు దేవాలయాలుగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని సవరించాలన్న, మార్పులు చేర్పులు చేయాలన్నా ఒక చట్టసభకే అధికారముందని ఆయన అన్నారు.
తాము జడ్జిని మేనేజ్ చేశారనే విధంగా ప్రతిపక్షాలు అంటున్నాయి..ఇదెక్కడి అన్యాయమని అడిగారు. అంటే తాము న్యాయమూర్తిని కొన్నామా? అని ఆయన అడిగారు. ఈ మాటకు కనీసం క్షమాపణ కూడా ప్రతిపక్షాలు చెప్పలేదని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.