విశాఖ శకుని అక్రమాలపై పోరాడతా : విజయసాయిరెడ్డి పై బుద్దా ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టిడిపి ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్ బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ శకుని విజయసాయి అరాచకాలపై పోరాటం చేస్తా అంటూ ఆయన పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బీసీలపై విజయసాయి అణచివేత ధోరణితో ప్రవర్తిస్తున్నారని, బీసీలను అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయసాయి అక్రమాలను అణచివేతను ప్రశ్నిస్తాం అని బుద్ధ వెంకన్న తెలిపారు.
ఆయన కాలిగోటికి సరిపోవు.. మాన్సాస్ ట్రస్ట్ భూములతో నీకు ఏం సంబంధం : సాయిరెడ్డికి పల్లా పంచ్
నేటితో ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకున్న బుద్దా వెంకన్న
నేటితో ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న బుద్ధ వెంకన్న, తన పదవీ కాలంలో ప్రజా సమస్యలపై పోరాటం చేశానని, పార్టీకి, చంద్రబాబుకి అంకితభావంతో పని చేశానని, భవిష్యత్తులో కూడా అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలో పని చేస్తానని చెప్పుకొచ్చారు. తనకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు ఇచ్చిన భిక్ష అని పేర్కొన్న బుద్ధా వెంకన్న, అధినేతని ఎవరైనా విమర్శిస్తే అసలు సహించను అంటూ తేల్చి చెప్పారు. సాధారణ కార్యకర్త నుండి ఎమ్మెల్సీగా ఎదిగానని, ఒక సాధారణ కార్యకర్తను సైతం గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.
టీడీపీ గొంతు నొక్కే యత్నం
రాష్ట్రంలో రెండేళ్లుగా వైసీపీ నియంతృత్వ పోకడ కొనసాగుతోందని, చట్టసభలన్నా , చట్టాలన్నా, చట్ట సభ్యులన్నా ఈ ప్రభుత్వానికి లెక్కలేని తనం ఉందని బుద్ధ వెంకన్న మండిపడ్డారు.టిడిపి సభ్యుల గొంతు వినిపించకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు.అమరావతి ని స్మశానం చేస్తూ తీసుకొచ్చిన మూడు రాజధానులు బిల్లును అడ్డుకోవడం కోసం తాము ఎంతో ప్రయత్నం చేస్తామని చెప్పిన బుద్ధా వెంకన్న మండలి కేంద్రంగా తాము సాగించిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.
తనకు ఎవరితో విబేధాలు లేవు
ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో తనకు ఏ నాయకుడుతోనూ గొడవలు లేవని, ఎంపీ కేశినేని నాని తో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీలో ముందుకు వెళ్తానని, పార్టీ అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు. ఇక విశాఖ శకుని విజయసాయి రెడ్డిపై పోరాటం చేస్తానని, ఆయన అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు బుద్దా వెంకన్న.