Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేబినెట్: హైదరాబాద్ బాధ్యతలు టీ గవర్నర్ చేతిలో

న్యూఢిల్లీ: తెలగాణపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) నివేదిక, ముసాయిదా బిల్లు కేంద్ర మంత్రి వర్గం ముందుకు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెసు నాయకులు, తెలంగాణ జెఎసి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టి జెఎసి నాయకులు బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ను కలిశారు.

కేంద్ర మంత్రులు జైరాం రమేష్, సుశీల్ కుమార్ షిండే సమావేశమై నివేదికకు తుది రూపు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. జైరాం రమేష్ బిజెపి నాయకుడు ఎం. వెంకయ్యనాయుడుకు రాయల తెలంగాణ ప్రతిపాదనపై వివరించారు.

మరోవైపు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు నివాసంలో సమావేశమయ్యారు. మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడాల్సిన విషయాలపై వారు కావూరి సాంబశివ రావుకు సూచించినట్లు సమాచారం. అలాగే, మంత్రి వర్గ సమావేశంలో రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పట్టుబట్టాలని మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని తెలంగాణ నేతలు కోరారు.

Cabinet meeting on Telangana: Live updates

- పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసి పరిధిని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ పాలనా బాధ్యతలను తెలంగాణ గవర్నర్ చేతిలో పెట్టాలని నిర్ణయించింది. తద్వారా యుటి చేయాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సిడబ్ల్యుసి తీర్మానానికే కేంద్ర మంత్రి వర్గం కట్టుబడింది.

- క్యాబినెట్ సమావేశం నిర్ణయంపై కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

- కావూరి సాంబశివ రావు సమావేశం నుంచి ముందుగానే వెళ్లిపోయారు. క్యాబినెట్‌లో రాష్ట్ర విభజన బిల్లుపై వాడిగా వేడిగా చర్చ జరిగింది.

- సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ముగిసింది.

- సమావేశం మధ్యలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బయటకు వచ్చారు. దాంతో సమావేశం ముగిసిందని భావించారు. తెలంగాణపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతోందని కమల్‌నాథ్ మీడియాతో చెప్పారు

- రాష్ట్ర విభజనపై మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది.

- రాష్ట్ర విభజనపై ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను పెంచారు. రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పెంచారు. రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.

- హైదరాబాద్‌ను యుటి చేయాలనే డిమాండ్‌తో పాటు ఇతర డిమాండ్లను అంగీకరించకపోతే రాష్ట్రపతికే నేరుగా తమ రాజీనామాలను సమర్పించాలని కావూరి సాంబశివరావు, పల్లంరాజు, చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

- గురువారం రాత్రి ఆంద్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత రాత్రే రాష్ట్రపతికి పంపనున్నట్లు ప్రచారం సాగతోంది.

- మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

- సమైక్యానికి గానీ రాయల తెలంగాణకు గానీ అంగీకరించకపోతే కావూరి సాంబశివ రావు, పల్లంరాజు రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. కిశోర్ చంద్రదేవ్ మాత్రం రాజీనామా చేయకపోవచ్చునని అంటున్నారు. కిశోర్ చంద్రదేవ్ రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే రాయలసీమను ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, రాయలసీమకు చెందిన రెండు జిల్లాలతో కలిపి తెలంగాణ ఏర్పాటు చేయవద్దని ఆయన వాదిస్తూ వస్తున్నారు.

- సమైక్యానికి గానీ రాయల తెలంగాణకు గానీ అంగీకరించకపోతే రాజీనామా చేసి మంత్రి వర్గ సమావేశం నుంచి బయటకు రావాలని, ఆ తర్వాత తాము కూడా రాజీనామాలు చేస్తామని రాయలసీమకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కావూరి సాంబశివరావును ఇతర సీమాంధ్ర కేబినెట్ మంత్రులతో చెప్పారు.

- తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఉపసంహరించుకుని పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. పది జిల్లాల తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని గురువారం జరిగిన కాంగ్రెసు కోర్ కుమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ మేరకు హోంశాఖ క్యాబినెట్ నోట్‌ను తయారు చేసింది.

- ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్టానికి చెందిన మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు, పల్లంరాజు హాజరయ్యారు. సుశీల్ కుమార్ షిండే, ఆంటోనీ, చిదంబరం సమావేశానికి వచ్చారు.

- పది జిల్లాల తెలంగాణకే కేంద్రం కట్టుబడాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు హైదరాబాదులో డిమాండ్ చేశారు. 12 జిల్లాల తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలిపితే శాసనసభ వేదికగానే యుద్దం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

- పది జిల్లాల తెలంగాణకే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు జాతీయ టీవి చానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

- తెలంగాణ జెఎసి నేతలు కేంద్ర మంత్రి అజిత్ సింగ్‌ను కలిశారు. పది జిల్లాల తెలంగాణకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని అజిత్ సింగ్ వారికి హామీ ఇచ్చారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని, అయితే 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు.

- సాయంత్రం ఐదు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఇందులో టేబుల్ ఐటమ్‌గా జివోఎం నివేదిక, ముసాయిదా బిల్లు చర్చకు రానుంది.

- పది జిల్లాల తెలంగాణ అయినా, 12 జిల్లాల తెలంగాణ అయినా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కావూరి సాంబశివ రావు పట్టుబట్టే అవకాశం ఉంది.

- కావూరి సాంబశివ రావు నివాసంలో జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యుల సమావేశం ముగిసింది.

- పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తాము మద్దతు ఇస్తామని ఆర్ఎల్‌డి నేత, కేంద్ర మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు.

- తాము రాష్ట్ర విభజనకు అంగీకరించబోమని, సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో, అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.

- కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పది జిల్లాల తెలంగాణకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

- పది జిల్లాలతో కూడిన తెలంగాణకు, 12 జిల్లాలతో కూడిన తెలంగాణకు సంబంధించిన రెండు నివేదికలను జివోఎం మంత్రివర్గానికి పంపించింది.

- జివోఎం సభ్యులు జైరాం రమేష్, నారాయణస్వామిలతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు. జివోఎం నివేదికపై, క్యాబినెట్ నోట్‌పై ఆయన వారితో చర్చించారు.

- తెలంగాణ కాంగ్రెసు నాయకులు గురువారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి తమకు పది జిల్లాల తెలంగాణ మాత్రమే కావాలని, రాయల తెలంగాణ వద్దని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+