సిఎం రెబెల్ స్టార్, తెలంగాణ నోట్ రాదు: లగడపాటి
హైదరాబాద్: తెలంగాణపై కేబినేట్ రాదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ నోట్ రాకుండా తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ మూడో తేదీన, నాలుగో తేదీన వస్తుందంటూ అంటున్నారని, కానీ అది రాదని ఆయన అన్నారు. తెలంగాణ సకల జనుల భేరీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.
సమైక్యాంధ్ర కోసం మాట్లాడడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెబెల్ స్టార్ అయిపోయారని, ప్రజల కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమ రాజీనామాలతో విభజన ప్రక్రియ ఆగిపోయిందని ఆయన అన్నారు. బూతు పురాణమే తమ సంస్కృతీ సంప్రాదాయాలని కెసిఆర్ చెప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరిది కట్టుబడి ఉద్యమమో, ఎవరిది పెట్టుబడి ఉద్యమమో నిన్నటి సభలతో తేలిపోయిందని ఆయన అన్నారు. పది వేల మంది కూడా పట్టని మైదానంలో సభ పెట్టి అదే మా బలమని సకలజనుల భేరీతో చాటుకున్నారని ఆయన అన్నారు. అన్ని పార్టీలకు చెందినవాళ్లు, పది జిల్లాల నుంచి వచ్చిన 20 వేల మంది లేరని లగడపాటి అన్నారు.

సకల జనుల భేరీ పెట్టుబడి సభ అని, కర్నూలులో జరిగింది కట్టుబడి సభ అని ఆయన అన్నారు. తాము రాష్ట్ర సమైక్యతను కాపాడుతున్నామని ఆయన అన్నారు. తమ రాజీనామాలు విభజన ప్రక్రియను ఆపాయని, ఈ నెల 12వ తేదీ వరకు స్పీకర్ మీరా కుమార్ ఢిల్లీలో ఉండడం లేదని, ఆమె వచ్చిన తర్వాత మరోసారి తమ రాజీనామాల ఆమోదానికి ఆమెను కలుస్తామని ఆయన చెప్పారు.
సిడబ్ల్యుసి నిర్ణయం వచ్చినప్పటి నుంచి కెసిఆర్ సీమాంధ్ర ప్రజల మీద, ఉద్యోగుల మీద విరుచుకుపడుతున్నారని ఆయన అన్నారు. తెరాసకు పంచాయతీ ఎన్నికల్లో పది శాతం సీట్లు కూడా రాలేదని, హైదరాబాదులో పోటీ చేసే దిక్కు కూడా లేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో తెరాస గల్లంతవుతుందని, వేర్పాటువాదులకు అడ్రస్ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో పెత్తందార్లు ప్రజలను రాబందుల్లా పీక్కు తిన్నారని, వారి చెర నుంచి ప్రజలను నక్సలైట్లు విడిపించారని, నక్సలైట్ల నుంచి పెత్తందార్లు పారిపోయారని ఆయన అన్నారు. ఒసేయ్ రాములమ్మ సినిమా చూస్తే ఎవరు ద్రోహులో తెలిసి వస్తుందని అన్నారు.
రాష్ట్రానికి వేర్పాటువాదుల వల్ల ముప్పు రాలేదని, సమైక్యాంధ్ర ముసుగులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వల్ల ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. అటువంటివారిలో కాంగ్రెసు నాయకులు కూడా కొందరు ఉన్నారని, వారిని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications