కాల్మనీ సెక్స్ రాకెట్: ప్రధాన నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ అరెస్ట్
హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ అరెస్టయ్యాడు. హైదరాబాద్లోని ఓ హోటల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ఫైనాన్స్ ఇప్పిస్తానని చెప్పి అనేక మంది మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు పెండ్యాల శ్రీకాంత్. ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పుడు ప్రధాన నిందితుడు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
కాగా, మంగళవారం రాత్రి ఏపికి సంబంధించిన పోలీసులకు శ్రీకాంత్ను అప్పగించారు టాస్క్ఫోర్స్ పోలీసులు. గతంలో శ్రీకాంత్ కోడిపందేలా కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. కాల్ మనీ నిందితులు ఏపి రాజధాని అమరావతిలో భారీ ఎత్తులో భూములు కొనుగోలు చేసినట్లుగా ఉన్న పలు పత్రాలు లభ్యమైనట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా, కాల్మనీ కేసులో నిందితుడిగా ఉన్న సత్యానందాన్ని మరో కేసులో ఏపీ పోలీసులు గత సోమవారం అరెస్ట్ చేశారు. సమాచార హక్కు చట్టం కేసులో నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చినందుకు గాను అతడిని అదుపులోకి తీసుకున్నారు.