రాజధాని నిరసనలు .. కారుణ్య మరణం కోసం రాష్ట్రపతికి మహిళల లేఖాస్త్రాలు
రాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనల బాట పట్టారు. సీఎం జగన్ ఎపీకి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని 29 గ్రామాల రైతులు ఏదో ఒక విధంగా తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు . అయినా పట్టింపు లేని ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతికి లేఖలు రాసి కారుణ్య మరణం ప్రసాదించాలని , తమకు చనిపోవటానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు రాజధాని ప్రాంత రైతులు . ఇక తాజాగా రాజధానిలోని మహిళలు కూడా కారుణ్య మరణం కావాలని రాష్ట్రపతికి లేఖలు రాసి ఆ లేఖలతోనే ఆందోళన నిర్వహించారు.

చావే దిక్కంటున్న రాజధాని ప్రాంత మహిళలు
రాజధాని అంశంలో రాజధాని ప్రాంత రైతులు మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని రైతులు కోరారు. సీఎం మూడు రాజధానుల నిర్ణయంతో తాము రోడ్డున పడ్డామన్నారు.తమ పరిస్థితి ఏంటో అర్ధం కావటం లేదన్నారు . అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని పేర్కొన్నారు. సీఎం, కొందరి స్వలాభం కోసమే రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారన్నారు. 16 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నామని, తమ గోడు వినిపించుకునే వారే లేరని రైతులు లబోదిబోమంటూ ఇక తమకు చావే శరణ్యం అని రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు.
రైతుల త్యాగాన్ని హేళన చేస్తున్నారని ఆగ్రహం
అధికార పార్టీ నేతలు రాజధాని కోసం రాజధాని ప్రాంత రైతులు చేసిన త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటూ చూస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పెయిడ్ ఆర్టిస్టులని హేళన చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులను తమ ఇళ్లపైకి పంపి మమల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ బతుకులు మాకొద్దు మాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని రాష్ట్రపతికి రాజధాని రైతులు లేఖ రాశారు.
కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి మహిళల లేఖలు
ఇక నేడు మహిళలు సైతం కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని మూకుమ్మడిగా దీక్షా శిబిరాలలోనే లేఖలు రాశారు . భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మందడం మహిళా రైతులు తమ లేఖల ద్వారా కారుణ్య మరణానికి అనుమతించాలని కోరారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు తీసుకొని రోడ్డున పడేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు చావే శరణ్యమని, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని మహిళలు రాష్ట్రపతికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు. దీక్షా శిబిరాల్లోనే మెర్సీ కిల్లింగ్ కు అనుమతి కావాలని ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications