హస్తిన గడ్డపై జగన్ గర్జన- భీమిలీ రోడ్లో సెక్రెటేరియట్: విశాఖపై తొలి ప్రకటనతో జోష్: ..!!
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా చేసిన తొలి ప్రకటన వైఎస్ఆర్సీ నాయకుల్లో జోష్ నింపింది.
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు తేలిపోయింది. సాగరనగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. ఇదివరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తరువాత పార్టీ క్యాడర్ లో ఎలాంటి ఉత్సాహం నెలకొందో- ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే నెలకొంది.

జగన్ మినహా..
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించడంపై ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ ఎప్పుడే గాని పెదవి విప్పలేదు. జగన్ మినహా అధికార పార్టీకి చెందిన మిగిలిన నాయకులందరూ పలు సందర్భాల్లో విశాఖపట్నానికి తరలివెళ్లడం గురించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన లీకులను ఇస్తూ వచ్చారు. ఈ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజూ చర్చనీయాంశంగా ఉండేలా చూసుకున్నారు.

హస్తిన గడ్డపై..
ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్.. విశాఖపట్నానికి తరలి వెళ్లడంపై తొలిసారిగా మాట్లాడారు.. అది కూడా దేశ రాజధాని నుంచే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హస్తిన గడ్డపై నుంచి రాష్ట్ర రాజధాని నగరాన్ని ఖరారు చేశారాయన. తాను కూడా త్వరలోనే విశాఖకు తరలి వెళ్లబోతోన్నానని, పెట్టుబడులు పెట్టడానికి అక్కడ అనువైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు. దీనితో- అమరవతి నుంచి సచివాలయం తరలి వెళ్లడం ఇక ఖాయమైంది.

ఉత్తరాంధ్రలో..
తాజాగా జగన్ చేసిన ప్రకటనతో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్ర ప్రజల చిరకాల కాంక్ష త్వరలో నెరవేరబోతోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు సెలబ్రేట్ చేసుకుంటోన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల్లో పండగ వాతావరణం నెలకొంది.

ఏప్రిల్ లోగా..
ఏప్రిల్ లోగా రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తామంటూ తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ గర్జన సమయంలోనే తాము ఈ విషయాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే విషయంలో ఎలాంటి రాజీధోరణిని పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏప్రిల్ నాటికి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయని అన్నారు.

భీమిలీ రోడ్డులో..
కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటి నుంచి పరిపాలన సాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్ గా వాడుకుంటానీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications