చంద్రబాబు, నారా లోకేష్పై కేసు నమోదు: రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తారా? అంటూ మాజీ మంత్రి
అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్పై పోలీసు కేసు నమోదైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొంగర భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 34 కింద కేసు నమోదు చేశారు.

మంత్రిపై ఆరోపణలు: చంద్రబాబు, లోకేష్పై కేసు నమోదు
ఏప్రిల్ 15న స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ కారణంగా ఓ చిన్నారి చనిపోయిందంటూ చంద్రబాబు, లోకేష్ పెట్టిన ట్వీట్లపై వైసీపీ నేత అభ్యంతరం తెలిపారు.
మంత్రి ర్యాలీ కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో వైద్యం అందక.. ఓ బాలిక చనిపోయిందంటూ చంద్రబాబు, లోకేష్ అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు.
ప్రజలకు, పోలీసులకు మధ్య విద్వేశాలు రెచ్చొట్టేలా.. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. దీంతో ఈ నేతలపై కేసు నమోదు చేశారు.

రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తారా? అంటూ నారా లోకేష్
కాగా, చంద్రబాబుతోపాటు తనపై కేసులు పెట్టడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డీ అంటూ విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇప్పటికే తనపై హత్యాయత్నంతోపాటు 11 కేసులు పెట్టారని, వాటికి ఇంకోటి కలిసిందన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయమంటే కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టారని, ఇక తనపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తారా? అంటూ సీఎంను ప్రశ్నించారు.

జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం: చంద్రబాబు
ఇది ఇలావుండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఏపీలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందన్నారు. పార్టీ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఒక అపరిచితుడని, ఆయన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ లో వెళ్తోందని విమర్శించారు. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందన్నారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతంవర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందన్నారు. జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని చంద్రబాబు అన్నారు.

జగన్ ఎంత బలహీనుడో తెలిసిందంటూ చంద్రబాబు విమర్శలు
తాజా కేబినెట్ విస్తరణతోనే జగన్ ఎంత బలహీనుడో అర్థమైందన్నారు చంద్రబాబు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా బయటపడిందని వ్యాఖ్యానించారు. బ్లాక్ మెయిల్ చేసినవారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరుగుతోందని అన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయి రెడ్డి.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది కూడా దోపిడీ చేసేందుకేనని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో పింఛన్లు కూడా సమయానికి ఇవ్వలేని స్థితిలో జగన్ సర్కారు ఉందని విమర్శించారు.












Click it and Unblock the Notifications