పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు.. వైసీపీ కుట్ర అంటూ టీడీపీ ఫైర్!!
పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. నోవా అగ్రిటెక్ కంపెనీ ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని ఇంకొల్లు పోలీసులు పర్చూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుండి అనుమతి తీసుకుని ఎమ్మెల్యే పై, కంపెనీ ఉద్యోగులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని ఏ 1 గా పేర్కొంటూ, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల పైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డి ఆర్ ఐ అధికారులు ఈనెల 24వ తేదీన గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీలో నిర్వహించిన సోదాలలో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు పోలీసులు.

కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజా ప్రతినిధి చట్టం 1951 లోని 123(1), ipc సెక్షన్ 171 (e), రెడ్ విత్ 120 (బి), crpc 155 (2) ల ప్రకారం కేసు నమోదు చేశారు. డి ఆర్ ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో, కార్యాలయంలో లభించిన ఒక డైరీలో ఎన్నికల అక్రమాలకు సంబంధించిన కీలక విషయాలు ఉండడంతో దీంతో అధికారులు బాపట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలోనే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పై కేసు నమోదు అయింది. అయితే వైసిపి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఏలూరి సాంబశివరావు రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురదజల్లే ఎందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్న వైసీపీప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోరాటం చేశారని ఆయనను అడ్డుకునే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టిడిపినేతలు నిప్పులు చెరుగుతున్నారు.
15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నోవా అగ్రి గ్రూప్ సంస్థను స్థాపించారని రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన సంస్థ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఎన్ని రాజకీయాలు చేసినా పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు గెలుపుని ఎవరు ఆపలేరని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications