బినామీల గుట్టు రట్టు.. ఏబీవీకీ చుక్కెదురు.. జగన్ సర్కారుపై క్యాట్ ఆగ్రహం
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేశారని, దేశ భద్రతకు ముప్పు కలిగించే రక్షణ పరికరాల్ని నిబంధనలకు విరుద్ధంగా కొన్నారనే ఆరోపణలపై సస్పెండైన మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్(క్యాట్)లోనూ చుక్కెదురైంది. తనపై జగన్ సర్కారు మోపిన ఆరోపణలన్నీ నిరాధరమైనవని, రాజకీయ ఒత్తిళ్లతో జారీ అయిన ఉత్తర్వుల్ని వెంటనే నిలిపేయాలన్న ఏబీవీ వాదనను క్యాట్ తోసిపుచ్చింది. అదేసమయంలోనే ప్రభుత్వంపైనా విచారణాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోపే ఏబీవీ అక్రమాస్తులకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది.

గంటపాటు వాదనలు
తనపై సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్ ను క్యాట్ శుక్రవారం విచారించింది. ఇప్పటికిప్పుడు సస్పెన్సన్ ఉత్తర్వులపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో ఏబీవీకి చుక్కెదురైనట్లయింది. ప్రభుత్వం తరఫు, ఏబీవీ తరపున లాయర్లు దాదాంపు గంటపాటు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున న్యాయవాదులు దాదాపు గంట పాటు తమ వాదనలు వినిపించారు. సస్పెన్షన్ పై స్టేకు నిరాకరించిన విచారణాధికారి.. ఏబీవీకి రావాల్సిన జీతం, సస్పెండైన విధానంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

జీతం ఎందుకు ఆపారు?
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వర రావు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. డీజీ స్థాయి ర్యాంకున్న ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా? కనీసం సస్పెన్షన్ తర్వాతైనా ఢిల్లీకి సమాచారం ఇచ్చారా? దాంతోపాటు వేతం చెల్లింపులు ఎందుకు నిలిపేశారు? గతేడాది మే 31 నుంచి జీతభత్యాలు ఎందుకు ఇవ్వడంలేదు?''అంటూ క్యాట్.. ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రశ్నలకు బదులు చెప్పాడానికి వారంరోజులు గడువు కావాలని ప్రభుత్వం కోరడంతో ఆమేరకు విచారణ ఫిబ్రవరి 24కు వాయిదా పడింది. కొద్ది రోజుల కిందటే కృష్ణ కిషోర్ విషయంలో క్యాట్ చేత చివాట్లు తిన్న వైసీపీ ప్రభుత్వం.. ఏబీవీ వ్యవహారంలోనూ అలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటుడటం గమనార్హం.

ఇజ్రాయెల్ నుంచి అక్రమంగా..
ఏబీవీ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగిన కాలంలో అప్పటి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా పెద్ద మాఫియా నడిపారని, ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాల్ని అక్రమంగా కొనుగోలు చేశారని, వైసీపీని దెబ్బతీయడానికి ప్రభుత్వ నిఘా వ్యవస్థను వాడుకున్నారని, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులోనూ ఏబీవీనే దళారీగా పనిచేశారని ప్రభుత్వ పెద్దలు తీవ్రఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే, తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఏబీవీ బినామీల లీలల గుట్టు రట్టయింది.

భారీ ఎత్తున భూ అక్రమాలు..
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న చిట్యాల, పసుపుల గ్రామాల్లో ఏబీవీ తన 11 మంది బినామీల ద్వారా సుమారు 118 ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పేరుపొందిన ఓ రాజకీయ నాయకుడు మధ్యవర్తిగా ఉండి ఏబీవీతో భూములు కొనిపించారని, ప్రస్తుతం అక్కడ ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం కొనసాగుతోందని తెలసింది. పొలంలోనే చక్కటి ఫాం హౌజ్ నిర్మించుకున్న ఏబీవీ నెలలో కనీసం ఒకసారైనా అక్కడికొచ్చి వెళతారని స్థానికులు చెబుతున్నారు. తమ నుంచి అక్రమంగా భూములు కొన్నారని, వెంటనే వాటిని తిరిగిచ్చేయాలని భూములు కోల్పోయిన రైతులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications