విచారణకు ఓకే: సబిత ఇంద్రారెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జూన్ 4వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అందులో ఆదేశించింది. సిబిఐ కోర్టులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) కేసు విచారణ జరిగింది.
సబితా ఇంద్రా రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందల పైన వచ్చిన అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించింది. జూన్ 4వ తేదీన కోర్టుకు హాజరు కావాలని సబితా, కృపానందలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
ఛార్జీషీటులో సబితా రెడ్డిని నిందితురాలిగా చేర్చడాన్ని కోర్టు అనుమతించింది. ఓఎంసి ఛార్జీషీటును కోర్టు పరిగణలోకి తీసుకుంది. సబిత పైన అభియోగాలను విచారణకు స్వీకరించడం ఆమెకు చిక్కే.
కాగా, సబితా ఇంద్రా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆమె ఈ సార్వత్రిక ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల నుండి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు.