అవినాష్ రెడ్డిని కస్టడీలో ప్రశ్నించాల్సి ఉంది: సీబీఐ
కడప ఎంపీ అవినాష్రెడ్డి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని సీబీఐ పేర్కొంది. ఇటీవల హైకోర్టులో సీబీఐ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటరు దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్య దర్యాప్తుపై కీలక వివరాలు వెల్లడించింది. దురుద్దేశపూర్వకంగానే అవినాష్ రెడ్డి దర్యాప్తునకు సహకరించడంలేదని, సమాధానాలను దాటవేస్తున్నారని, వాస్తవాలు చెప్పడంలేదని కౌంటర్ లో పేర్కొంది.
అవినాష్ ను అరెస్ట్ చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అవినాష్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ముందుకు రావట్లేదని, అతని అనుచరులవల్ల దర్యాప్తునకు పలుమార్లు ఆటంకం కలిగిందని తెలిపింది. ఎంపీ దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అతనికి నేరచరిత్ర ఉందని, నాలుగు క్రిమినల్ కేసులున్నాయని, సాక్షులను ప్రభావితం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, హత్యకు గురైన వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య, గంగాధర్ రెడ్డి ప్రభావితమైనట్లు కనిపిస్తోందని సీబీఐ ఆ కౌంటర్ లో పేర్కొంది.

వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలు చెరిపేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని, హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపేయడమనేది కుట్రలో భాగమే. సునీల్ యాదవ్తో అవినాష్రెడ్డికి ఉన్న సంబంధం తెలియాలని, హత్య జరిగిన రోజు అవినాష్రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ ఎందుకెళ్లాడో తేల్చాల్సి ఉందంది. కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందేమో తెలుసుకోవాలని, మార్చి 15న అవినాష్రెడ్డి ఎక్కడెక్కడున్నారో నిర్ధారించాల్సి ఉందని, నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తామన్నారని గంగాధర్రెడ్డి అన్నారని, అతని వాంగ్మూలంలో వాస్తవం తేలాలని తెలిపింది. దస్తగిరిని ఓబుల్రెడ్డి, భరత్ యాదవ్ ఎందుకు కలిశారో కూడా తేలాలని సీబీఐ కౌంటర్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications