YS Viveka Case: అవినాష్ విచారించిన సీబీఐ - కీలక సమాచారం..!!
వైఎస్ వివేకా కేసులో సీబీఐ అయిదు గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించింది. హైకోర్టు సూచనల మేరకు రాత పూర్వకంగా ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అవినాష్ విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించటంతో ఈ మేరకు వ్యవహరించినట్లు సమాచారం. అటు సీబీఐ కస్టడీ లో భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ ల విచారణ నిర్వహించారు. ఈ నెల 25 వరకు అవినాష్ ను అరెస్ట్ చేయద్దని హైకోర్టు ఆదేశాలతో విచారణ ద్వారా సీబీఐ తమకు కావాల్సిన సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తూ సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ ను అయిదు గంటల పాటు విచారించారు. కోర్టులో జరిగిన వాదనల్లో వివేకా హత్య కేసు డీల్ రూ 40 కోట్లుగా సీబీఐ పేర్కొంది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించటంతో, దీని చుట్టూనే సీబీఐ నగదు ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ జరిగినట్లు సీబీఐ చెబుతూ వచ్చింది. ఎక్కడ నుంచి ఈ నగదు వచ్చింది... ఎవరెవరు కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చారనే సమాచారం పైన తెలుసుకొనే ప్రయత్నం జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది.

హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని కోర్టులో వాదించిన సీబీఐ...ఆధారాల టాంపరింగ్ జరిగినట్లు ఆరోపించారు. నిందితులతో ఉన్న సంబంధాల పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. అటు భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ లను న్యాయవాదుల సమక్షంలో విచారించారు.కోర్టు ద్వారా వీరిద్దరి విచారణకు అనుమతి పొందిన సీబీఐ రేపు మరోసారి విచారించనుంది. అటు, సీబీఐ సూచించిన విధంగా విచారణకు సహకరించాలని కోర్టు అవినాష్ రెడ్డికి స్పష్టం చేసింది. ఈ నెల 25న అప్పటి వరకు జరిగిన విచారణ తీరు..వాదనలు మరోసారి పరిశీలించిన తరువాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పైన హైకోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications