వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ? సీబీఐ అనుమానాలు ! కడప టికెట్ వద్దన్నందుకే?
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కుముడి త్వరలో వీడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసును సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. కడప ఎంపీ అవినాష్ పాత్రపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను కడప నుంచి బరిలోకి దించే విషయంలో తలెత్తిన విభేదాలే అంతిమంగా వివేకా హత్యకు కారణమయ్యాయని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చిక్కుముడి త్వరలో వీడిపోనుంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సంపాదించిన సీబీఐ.. వరుసగా ఛార్జిషీట్లు దాఖలు చేస్తోంది. ఇందులో వైఎస్ కుటుంబానికి చెందిన పలువురిపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు వివేకా హత్యకు దారి తీసిన పరిణామాలపై ఓ అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ హై ప్రొఫైల్ హత్య, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై త్వరలో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ముందునుంచీ అనుమానిస్తున్నట్లుగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై తాజాగా సీబీఐ వ్యక్తం చేసిన అనుమానాలు ఈ మొత్తం వ్యవహారానికి భారీ ట్విస్ట్ ఇచ్చాయి.
వివేకాను అవినాష్ హత్య చేయించారా?
మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తన పెదనాన్న అయిన వైఎస్ వివేకానందరెడ్డిని కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేయించి ఉండొచ్చనే అనుమానాల్ని సీబీఐ తన తాజా ఛార్జిషీట్లలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అవినాష్ పాత్రపై ముందునుంచీ వ్యక్తమవుతున్న అనుమానాలకు కొనసాగింపుగా సీబీఐ ఆయన పాత్రపై కీలక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అవినాష్ హత్య చేయించి ఉండొచ్చనే దానికి సంబంధించి సీబీఐ వ్యక్తం చేసిన కారణాలు మరింత సంచలనం రేపేలా ఉన్నాయి.
కడప ఎంపీ టికెట్ వద్దన్నందుకే!
కడప నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ వద్దన్నందుకే వైఎస్ వివేకా హత్య జరిగి ఉండొచ్చని సీబీఐ తాజాగా ఛార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి బదులుగా తనకు కానీ, వైఎస్ షర్మిలకు కానీ, విజయమ్మకు కానీ కడప ఎంపీ టికెట్ కేటాయించాలని అడిగినందుకే కక్షతో వివేకాను అవినాష్ తన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి సాయంతో హత్య చేయించి ఉండొచ్చని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఈ దిశగా కేసును కీలక మలుపు తిప్పబోతోంది.
డమ్మీ హంతకుడిని పెట్టి!
వివేకానందరెడ్డిని హత్య చేసింది ఒకరైతే ఈ నేరం ఒప్పుకుని జైలుకెళ్లేందుకు డమ్మీని కూడా హంతకులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తిని ఈ హత్యానేరం తనపై వేసుకుని జైలుకు వెళ్తే రూ.10 కోట్లు ఇస్తామని అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఆఫర్ చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సైతం తమ పేర్లు చెప్పకుండా ఉంటే లైఫ్ సెటిల్ చేస్తామంటూ శంకర్ రెడ్డి ఇచ్చిన హామీని కూడా సీబీఐ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది.
Recommended Video
భారీ కుట్రను వెలికితీస్తున్నామన్న సీబీఐ
వివేకా హత్య కేసులో భారీ కుట్రను వెలికి తీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామంటూ సీబీఐ తన తాజా ఛార్జిషీట్లలో పేర్కొనడం మరింత కలకలం రేపుతోంది. ఈ హై ప్రొఫైల్ కేసులో వైఎస్ కుటుంబానికి చెందిన ఇంకెవరి పేర్లు బయటికి వస్తాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఈ హత్య ప్రణాళికలో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాలుపంచుకున్నట్లు సీబీఐ తన అభియోగపత్రాల్లో పేర్కొంది.
దీంతో వీరందరినీ అరెస్టు చేస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇందులో ఏ ఒక్కరిని అరెస్టు చేసినా సొంత కుటుంబ సభ్యుడిని చంపుకున్న మచ్చ వైఎస్ కుటుంబంపై పడుతుంది. అది అంతిమంగా అధికార వైసీపీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.