గ్యాంగ్ రేప్: డ్యాన్సర్ను విచారిస్తున్న పోలీసులు

నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్కు వచ్చిన డ్యాన్సర్కు(26) మత్తు మందిచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నలుగురు వ్యక్తులు తనకు మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం తనవద్ద ఉన్న నగదు, నగలు దోచుకుని ముంబైకి వెళ్లే బస్సు ఎక్కించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈనెల రెండో తేదీన వర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు ఒక ప్రభుత్వేతర సంస్థ జోక్యంతో మంగళవారం కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో నీలిచిత్రాలు రూపొందించే ముఠా ప్రమేయం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్లో ఉన్న ఈవెంట్ కో ఆర్డినేటర్ను విచారించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లో డ్యాన్స్ చేసేందుకు రూ.లక్ష చెల్లిస్తామని నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
కార్యక్రమం కోసం బాధితురాలు డిసెంబరు 31న హైదరాబాద్కు విమానంలో చేరుకోగా ఈవెంట్ నిర్వాహకులు నలుగురు ఆమెను కలుసుకున్నారు. విమానాశ్రయం నుంచి సుమారు అరగంట ప్రయాణం తర్వాత హోటల్కు తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు డ్యాన్స్ ఉంటుందని, అంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఏదో శీతల పానీయం ఇచ్చారు. స్పృహలోకి రాగా బోరివలికి వచ్చే లగ్జరీ బస్సులో ఉన్నానని బాధితురాలు చెప్పింది.
అంథేరీలో బస్సు దిగి పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని, రెండు రోజులు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వేతర సంస్థ జనశక్తి ఫౌండేషన్ను ఆశ్రయించినట్లు చెప్పింది. నిందితులు తన డెబిట్ కార్డులు, ఆభరణాలు, సెల్ఫోన్, రూ.17,000 నగదు అపహరించినట్లు ఆరోపించారు. ముంబైకి బస్సు టిక్కెట్ను ఇస్మాయిల్ షేక్ అనే వ్యక్తి బుక్ చేశాడని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications