ఇక నాలుగు గంటల్లోనే అమరావతి టు హైదరాబాద్..!!
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్ లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య తీసుకోవాల్సిన నిర్ణయాల పైన పలు సూచనలు చేసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలకు రూపకల్పన జరుగుతోంది. తాజాగ ఏపీ రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే కు ఆమోదం లభించటంతో.. రెండు రాష్ట్రాల ప్రయాణీకులకు వరంగా మారనుంది.
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే
రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అమరావతి-హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించింది. అదే విధంగా త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది. ఈ డీపీఆర్ కార్యరూపం దాల్చితే.. అమరావతి - హైదరాబాద్ మధ్య నాలుగు గంటల్లోగానే గమ్య స్థానం చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ రిఫైనరీ
ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ లైన్ గురించి భూ సేకరణ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతోంది. కేంద్రం నిధులను మంజూరు చేసింది. దీంతో, ఇక రవాణా వ్యవస్థ మరింతగా అందుబాటులోకి రానుంది. ఇదే సమయంలో.. ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్ కారిడార్ల ఏర్పాటును రైల్వేశాఖ పరిశీలించనుంది. పలు సమస్యల పరిష్కారానికి పలు శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం రంగం లో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు.
విభజన సమస్యల పై
ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ కోసం ప్రధాని శంకుస్థాపన చేసారు. రెండేళ్ల లో అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్దేశించారు. ఇక, విశాఖ.. కర్నూలు, హైదరాబాద్, అమరావతి కారిడార్ పైన చర్చించారు. పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. తెలంగాణ విషయంలో నీతి అయోగ్ తో చర్చలు చేయాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications