వైఎస్ జగన్కు కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్..!!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బకాయిలను విడుదల చేసింది. 17,000 కోట్ల రూపాయలను చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన జీఎస్టీ బకాయిలు అవి. ఈ రాష్ట్రాలవారీగా ఎంత మొత్తాన్ని కేటాయించామనే విషయాన్నీ స్పష్టం చేస్తూ ఆ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
బకాయిల కోసం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 21 రాష్ట్రాలకు ఏప్రిల్-మే-జూన్ మధ్యకాలానికి చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల రూపంలో 17,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బకాయిల కోసం రెండు తెలుగురాష్ట్రాలు కూడా కేంద్రం వద్ద మొర పెట్టుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి రావాల్సిన బకాయిలను రెండో త్రైమాసికం నాటికే విడుదల చేయాల్సి ఉంటుందంటూ డిమాండ్ చేశాయి అప్పట్లో.
జీఎస్టీ బకాయిల కోసం..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు- జీఎస్టీ బకాయిల విషయంలో పలుమార్లు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయంలో ఏపీ కొంత మెతక వైఖరిని కనపరిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తులు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పలుమార్లు నిర్మల సీతారామన్తో సమావేశం అయ్యారు.
ఇప్పటి వరకు రూ.1,15,662 కోట్లు..
ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన జీఎస్టీ పరిహారాల చెల్లింపు మొత్తం 1,15,662 కోట్ల రూపాయలకు చేరినట్టయింది. సెస్ రూపంలో జరిగిన వసూళ్లు 72,147 కోట్ల రూపాయలు మాత్రమే. అది పోగా మిగిలిన 43,515 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచి సమీకరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, ఈ ఆర్థిక సంవత్సరంలో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వీలుగా దీన్ని విడుదల చేసినట్లు చెప్పారు.
ఏపీ, తెలంగాణ వాటా ఇదే..
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఎస్టీ బకాయిల్లో ఏపీకి లభించిన వాటా మొత్తం 682 కోట్ల రూపాయలు. తెలంగాణ వాటా కింద రావాల్సిన విడుదలను కూడా కేంద్రం విడుదల చేసింది. 542 కోట్ల రూపాయలను తెలంగాణకు మంజూరు చేసింది. ఇదివరకటితో పోల్చుకుంటే ఈ రెండు రాష్ట్రాలకు కేటాయించిన మొత్తాల విలువ తక్కువగానే కనిపిస్తోంది
మహారాష్ట్ర టాప్..
మిగిలిన రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. అస్సాం- రూ.192 కోట్లు, బిహార్-రూ.91 కోట్లు, ఛత్తీస్గఢ్-రూ.500 కోట్లు, ఢిల్లీ-రూ.1,200 కోట్లు, గోవా-రూ.119 కోట్లు, గుజరాత్-రూ.856 కోట్లు, హర్యానా-రూ.622 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.226 కోట్లు, జమ్మూ కాశ్మీర్- రూ.208 కోట్లు, జార్ఖండ్-రూ.338 కోట్లు, కర్ణాటక-రూ.1,915 కోట్లు, కేరళ-రూ.773 కోట్లు, మధ్యప్రదేశ్-రూ.722 కోట్లు, మహారాష్ట్ర-రూ.2,081 కోట్లు, ఒడిశా-రూ.524 కోట్లు, పుదుచ్చేరి-రూ.73 కోట్లు, పంజాబ్-రూ.984 కోట్లు, రాజస్థాన్-రూ.806 కోట్లు, తమిళనాడు-1,188 కోట్లు, ఉత్తర ప్రదేశ్-1,202 కోట్లు, ఉత్తరాఖండ్-342 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.814 కోట్లు మంజూరు అయ్యాయి.